'కాంగ్రెస్ పార్టీకి మహిళా సునామీ కావాలి'
సార్వత్రిక ఎన్నికల్లో ఘోర పరాజయాన్ని మూటగట్టుకున్న కాంగ్రెస్ పార్టీకి మహిళా శక్తి సునామీ కావాల్సిందేనంటున్నారు ఆ పార్టీ యువరాజు రాహుల్ గాంధీ. అంటే.. పరోక్షంగా తన సోదరి ప్రియాంకా గాంధీని పిలుస్తున్నారో, దేశంలో ఉన్న మహిళా శక్తిని నిద్ర లేపుతున్నారో ఆయనకే తెలియాలి. త్వరలో మహారాష్ట్ర, హర్యానా రాష్ట్రాల్లో ఎన్నికలు ఉండటంతో ఒకవైపు మహిళా బిల్లుకు తమ పూర్తి మద్దతు ఉంటుందని చెబుతూనే.. మరోవైపు ఇలా మహిళా శక్తి గురించి కూడా రాహుల్ మాట్లాడుతున్నారు. యూపీఏ ప్రభుత్వం ప్రవేశపెట్టిన ప్రతి ఒక్క పథకం సామాన్యుడికి మేలు చేసిందని ఆయన అన్నారు.
మన దేశంలో దేవతలను ఆరాధిస్తామని.. కానీ ఆలయాల్లో దేవతలను ఆరాధించేవాళ్లలో చాలామంది బయట బస్సుల్లోను, రోడ్ల మీద మహిళలను వేధిస్తున్నారని రాహుల్ గాంధీ చెప్పారు. దేశంలోని ప్రతి మహిళా ఏదో ఒక సందర్భంలో వేధింపులకు గురైనవారేనని ఆయన అన్నారు.