జమీన్ వాపసీ డాట్కామ్
సెలవుల తర్వాత ఫుల్ రీచార్జ్ అయిన కాంగ్రెస్ పార్టీ జాతీయ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ.. విశ్లేషకులు సైతం ఊహించని రీతిలో మోదీ సర్కారుతో తలపడేందుకు సిద్ధమయ్యారు. ఆయుధంగా భూసేకరణ సవరణ బిల్లును ఉపయోగించుకోనున్నారు. అందులో భాగంగానే హిందూత్వ శక్తుల 'ఘర్ వాపసీ' కి కౌంటర్ ఇస్తూ.. ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రజల మద్దతు కూడగట్టేందుకు 'జమీన్ వాపసీ' పేరుతో కాంగ్రెస్ పార్టీ శనివారం అధికారిక వెబ్సైట్ను ఆవిష్కరించింది.
ఇందులో కాంగ్రెస్ పార్టీ నేతృత్వంలోని గత ప్రభుత్వాలు రూపొందించిన చట్టాలతోపాటు ఎన్డీఏ ప్రభుత్వ నిర్ణయాలను కూడా పొందుపర్చింది. తద్వారా తమ హయాంలోనే రైతులకు మేలు జరిగిందనే విషయాన్ని వివరించే ప్రయత్నం చేసింది. ఢిల్లీలోని రాంలీలా మైదానంలో ఆదివారం (ఏప్రిల్ 19) జరగనున్న రైతు ర్యాలీకి మద్దతు తెలపాలంది. వెబ్సైట్లో పేర్కొన్న నంబర్కు మిస్డ్ కాల్ లేదా ఎస్సెమ్మెస్ పంపడం ద్వారా కాంగ్రెస్ పార్టీ చేస్తోన్న భూ విప్లవ పోరాటాన్ని బలపర్చాలని కోరింది. అంతకుముందు ఉదయం వివిధ రైతుసంఘాల ప్రతినిధులతో రాహుల్ గాంధీ సమావేశమయ్యారు. పార్టీ ఆధ్వర్యంలో ఆదివారం జరగబోయే రైతుర్యాలీకి సన్నాహకంగా వివిధ రాష్ట్రాల నుంచి వచ్చిన వివిధ రైతు ప్రతినిధులను తన నివాసంలో కలుసుకున్నారు.