‘మోదీ భూకేటాయింపుల’పై విచారణ జరిపించాలి
న్యూఢిల్లీ: గుజరాత్లో భూ స్కాంపై విపక్ష కాంగ్రెస్ ప్రభుత్వంపై ఒత్తిడి పెంచుతోంది. నరేంద్ర మోదీ సీఎంగా ఉన్నప్పుడు జరిగిన భూకేటాయింపులన్నింటిపై సుప్రీంకోర్టు పర్యవేక్షణలో స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ (ఎస్ఐటీ) చేత విచారణ జరిపించాలని డిమాండ్ చేసింది. మోదీ సీఎంగా, ప్రస్తుత సీఎం ఆనందీబెన్ పటేల్ రెవెన్యూ మంత్రిగా ఉన్నప్పుడు జరిగిన భూమి కేటాయింపులపై ఎస్ఐటీ దర్యాప్తు జరిపి నిగ్గు తేల్చాలని కాంగ్రెస్ ప్రతినిధి ఆనంద్శర్మ శనివారం డిమాండ్చేశారు.
ఆనందీబెన్ పటేల్ కుమార్తె అనర్ పటేల్కు రూ.122 కోట్ల విలువైన భూమిని అప్పనంగా కట్టబెట్టారని ఆరోపించారు. విచారణ జరిపించి మోదీ పరిశుద్ధుడిగా బయటికి రావాలని పేర్కొన్నారు. అనర్ స్పందిస్తూ తాను ప్రభుత్వం నుంచి ఎటువంటి లబ్ధి పొందలేదని వివరణ ఇచ్చారు. భూమిని పొందిన డబ్ల్యూడబ్ల్యూఆర్ఆర్పీఎల్ యజమాని దక్షేశ్భాయ్ తనకు వ్యాపార భాగస్వామేనన్నారు.