కేరళ తీరంలో అనుమానాస్పద బోటు
తిరువనంతపురం:కేరళ సముద్ర తీరంలోకి ప్రవేశించిన ఓ అనుమానాస్పద విదేశీ బోటును కోస్ట్ గార్డ్ సిబ్బంది అడ్డుకున్నారు. ఆదివారం అలాపుజ్హా తీరంలోకి విదేశీ బోటు రావడాన్ని గమనించిన కోస్ట్ గార్డ్ దళాలు అప్రమత్తమైయ్యాయి. ఆ తరువాత బోటును తిరువనంతపురంలోని విజ్హింజమ్ ప్రాంతానికి తరలించారు. ఆ బోటులో కేరళ తీరానికి వచ్చిన 12 మందిని ఇరాన్ కు చెందిన వారిగా గుర్తించారు. వారిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.
కేంద్ర, రాష్ట్ర ఇంటెలిజెన్సీ ఏజెన్సీలు, రాష్ట్ర పోలీసులు ఇచ్చిన సమాచారం మేరకే తాము అప్రమత్తమైనట్లు కోస్ట్ గార్డ్ అధికారి ఒకరు తెలిపారు. వారి వద్దనున్న నిషేధిత శాటిలైట్ ఫోన్స్ ను కూడా స్వాధీనం చేసుకున్నట్లు పేర్కొన్నారు. ప్రస్తుతం విచారణ కొనసాగుతుందని కేరళ పోలీసులు తెలిపారు.