పీడీపీకి సీఎం.. బీజేపీకి డిప్యూటీ సీఎం..
న్యూఢిల్లీ: జమ్మూ కశ్మీర్లో ఒకటో తేదీ ఏర్పడే ప్రభుత్వంలో పీడీపీ అధినేత ముఫ్తి మహ్మద్ సయీద్ ముఖ్యమంత్రిగా ఉంటారని, బీజేపీ ఉప ముఖ్యమంత్రి పదవి తీసుకుంటుందని ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి వారణాసి రామ్మాధవ్ చెప్పారు. జమ్మూ - కశ్మీర్ రాష్ట్రంలో పీడీపీ - బీజేపీ కూటమి ఏర్పాటులో కీలక పాత్ర పోషించిన ఆయన 'సాక్షి'తో మాట్లాడారు.
'బీజేపీ - పీడీపీ మధ్య అనేక అంశాల్లో భేదాభిప్రాయాలు ఉన్నా.. రాష్ట్ర అభివృద్ధి కోసమే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తున్నాం. కనీసం ఉమ్మడి ప్రణాళిక ఆధారంగా ప్రభుత్వాన్ని నడుపుతాం. రెండు పార్టీలు సమానంగా మంత్రి పదవులను పంచుకుంటాం. పీడీపీ నుంచి సీఎంగా ముఫ్తీ, బీజేపీ నుంచి డిప్యూటీ సీఎంగా ఉంటారు. అధికారం కోసం మేం పాకులాడలేదు. అలా అయితే ఎప్పుడో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేవాళ్లం. అందరితో చర్చలు జరిపి ఒప్పించి కామన్ ఎజెండా తయారు చేశాం. వివాదాస్పద అంశాల వైపు వెళ్లకుండా అభివృద్ధి, శాంతి స్థాపన పైనే దృష్టి సారించాం' అని రామ్ మాధవ్ అన్నారు.