రెండుసార్లు సీఎం అయిన చాయ్వాలా!
గుజరాత్ రాష్ట్రానికి నాలుగుసార్లు ముఖ్యమంత్రిగా వ్యవహరించిన నరేంద్రమోడీ ఒక చాయ్ వాలా. ఆయన గతంలో టీ అమ్ముకున్నారు. ఇప్పుడు మరో చాయ్వాలా కూడా ముఖ్యమంత్రి అయ్యారు. ఆయనెవరో కాదు.. మాజీ ముఖ్యమంత్రి జయలలితకు అత్యంత విశ్వాసపాత్రుడైన పన్నీర్ సెల్వం. అనుకోకుండా రెండుసార్లు ఆయన తమిళనాడుకు ముఖ్యమంత్రి అయ్యారు. మదురైకి చెందిన పన్నీర్ సెల్వం ఒక టీస్టాల్ యజమాని. ఆయన కుటుంబానికి చెందినవాళ్లు ఇప్పటికీ ఆ టీ దుకాణాన్ని నడిపిస్తున్నారు కూడా.
మదురై ప్రాంతంలో బాగా ప్రభావవంతమైన దేవర్ వర్గానికి చెందిన పన్నీర్ సెల్వం 1996లో పెరియంకుళం మునిసిపాలిటీకి ఛైర్మన్గా రాజకీయాల్లోకి ప్రవేశించారు. జయలలితకు అత్యంత ఆప్తమిత్రురాలైన శశికళ మేనల్లుడు టీటీవీ దినకరన్తో సన్నిహిత సంబంధాలు ఉండటం పన్నీర్కు బాగా కలిసొచ్చింది. 2001లో పెరియంకుళం నుంచి తొలిసారి ఎమ్మెల్యే కాగానే రెవెన్యూ మంత్రి అయిపోయారు. అదే సంవత్సరంలో జయలలిత రాజీనామా చేయాల్సి వచ్చినప్పుడు ఆయనే ముఖ్యమంత్రి అయ్యారు. తర్వాత మళ్లీ జయలలిత అధికారంలోకి వచ్చినా ప్రభుత్వంలో నెంబర్ 2 హోదాను అనుభవించారు.