లెఫ్టినెంట్ గవర్నర్దే తుది నిర్ణయం
న్యూఢిల్లీ: చీఫ్ సెక్రటరీ నియామకంపై ఢిల్లీ ప్రభుత్వానికి, లెఫ్టినెంట్ గవర్నర్ వివాదం నేపధ్యంలో కేంద్ర ప్రభుత్వం రంగంలోకి దిగింది. చర్చల ద్వారా సమస్యను పరిష్కరించుకోవాలని మొదట సన్నాయి నొక్కులు నొక్కిన కేంద్రం ఇప్పుడు ప్రత్యక్షంగా రంగంలోకి వచ్చింది. ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ నజీబ్ జంగ్ అధికారాలను స్పష్టం చేస్తూ కేంద్రం శుక్రవారం గెజిట్ నోటిఫికేషన్ జారీ చేసింది.
ఈ మేరకు ఢిల్లీ ప్రభుత్వానికి కేంద్ర హోంశాఖ నోట్ పంపింది. ఢిల్లీలో పరిపాలనపై తుది నిర్ణయం లెప్ట్నెంట్ గవర్నర్దేనని స్పష్టం చేసింది. నిర్ణయాలను తీసుకునే ముందు ఢిల్లీ కేబినెట్ను సంప్రదించాల్సిన అవసరం లేదని తేల్చి చెప్పింది. కొన్నింటిపై ప్రభుత్వం అభిప్రాయం తీసుకున్నా..లెప్ట్నెంట్దే తుది నిర్ణయమని తెలిపింది. కాగాలెప్ట్నెంట్ గవర్నర్ను అడ్డంపెట్టుకుని బీజేపీ తమ ప్రభుత్వాన్ని ఇరకాటంలో పెట్టడానికి చూస్తోందని విమర్శిస్తున్న ఆప్ దీనిపై ఎలా స్పందింస్తుందో చూడాలి.
ఆప్ ప్రభుత్వానికి, తాత్కాలిక ప్రధాన కార్యదర్శిగా ఐఏఎస్ శకుంతలా గామ్లిన్ను లెఫ్టినెంట్ గవర్నర్ జంగ్ నియామకం చేయటంపై వివాదం నెలకొన్న విషయం తెలిసిందే. ఈ ఆధిపత్య పోరు అనేక పరిణామాల మధ్య మరింత ముదిరి ప్రెసిడెంట్ ప్రణబ్ ముఖర్జీ దాకా వెళ్లాయి. ఈ వివాదంపై కేజ్రీవాల్, నజీబ్ లు పరస్పరం లేఖాస్త్రాలు సంధించుకున్నారు. ప్రభుత్వాన్ని మీ చేతుల్లోకి తీసుకోవద్దంటూ ఎల్జీకి సీఎం లేఖ రాయగా, తన అధికారాల గురించి కేజ్రీవాల్ చెప్పాల్సిన పనిలేదంటూ జంగ్ ప్రతిస్పందించారు.
ఇద్దరూ విడివిడిగా రాష్ట్రపతి ప్రణబ ముఖర్జీ దర్శనం చేసుకుని వివాదానికి దారి తీసిన పరిస్థితుల గురించి ఏకరువు పెట్టారు. రాష్ట్రపతి పాలన ఉన్న సమయంలో వ్యవహరించినట్లుగా ఎల్జీ వ్యవహరిస్తున్నారని సీఎం కేజ్రీవాల్ ఫిర్యాదు చేస్తూ ప్రధాని మోదీకి లేఖ రాశారు. ఈ నేపథ్యంలో చర్చల ద్వారా సమస్యను పరిష్కరించుకోవాలని సీఎం, ఎల్జీలకు కేంద్రం గతంలో సూచించింది.