ఇక ‘ఐకానిక్‌’ చార్మినార్‌!

ఇక ‘ఐకానిక్‌’ చార్మినార్‌!


స్వచ్ఛభారత్‌ మిషన్‌ కింద మరో 10 స్వచ్ఛ ఐకానిక్‌ ప్రదేశాలను ప్రకటించిన కేంద్రం



సాక్షి, న్యూఢిల్లీ: దాదాపు నాలుగు శతాబ్దాలకు పైగా చరిత్ర కలిగిన చార్మినార్‌ను స్వచ్ఛ ఐకానిక్‌ ప్రదేశంగా గుర్తించి ప్రత్యేక పరిశుభ్రత కార్యక్రమాన్ని చేపట్టాలని కేంద్రం నిర్ణయించింది. స్వచ్ఛ భారత్‌ మిషన్‌ కింద ‘స్వచ్ఛ ఐకానిక్‌ ప్లేసెస్‌ ఇనీషియేటివ్‌’రెండో దశలో భాగంగా చార్మినార్‌తో పాటు 10 ప్రదేశాలను ప్రకటించింది. మంగళవారం జమ్మూ కశ్మీర్‌లోని మాతా వైష్ణోదేవి ఆలయంలో జరిగిన కార్యక్రమంలో కేంద్ర తాగు నీరు, పరిశుభ్రత శాఖ మంత్రి నరేంద్ర సింగ్‌ తోమర్‌ ఈ విషయాన్ని ప్రకటించారు. ఈ ప్రదేశాల్లో ఉన్నత స్థాయిలో పరిశుభ్రత కార్యక్రమం చేపట్టడంతో పాటు సందర్శకులకు సౌకర్యాలు కల్పిస్తారు.



చార్మినార్‌తో పాటు గంగోత్రి, యమునోత్రి, ఉజ్జయినీలోని మహా కాళేశ్వర్‌ మందిర్, గోవాలోని చర్చ్‌ అండ్‌ కాన్వెంట్‌ ఆఫ్‌ సెయింట్‌ ఫ్రాన్సిస్‌ ఆఫ్‌ అసైసీ, ఎర్నాకు లంలోని ఆదిశంకరాచార్య, శ్రావణ బెలగోలాలోని గోమఠేశ్వర్, దేవగర్‌లోని బైజ్‌నాథ్‌ ధామ్, బిహార్‌లోని తీర్థగయా, గుజరాత్‌లోని సోమ్‌నాథ్‌ దేవాలయాలను రెండో దశలో ఐకానిక్‌ ప్రదేశాలుగా ప్రకటించారు. ఇప్పటికే మొదటి దశలో ఏపీలోని తిరుమల దేవాల యం, తిరుపతి, అజ్మీర్‌ షరీఫ్‌ దర్గా, సీఎస్టీ ముంబై, అమృత్‌సర్‌లోని స్వర్ణ దేవాలయం, అసోంలోని కామాఖ్య దేవాలయం, వారణాసిలోని మణికర్నిక ఘాట్, మదురైలోని మీనాక్షి దేవాలయం, జమ్మూ కశ్మీర్‌లోని మాతా వైష్ణోదేవి ఆలయం, పూరిలోని జగన్నాథ్‌ దేవాలయం, ఆగ్రాలోని తాజ్‌మహల్‌లను ఐకానిక్‌ ప్రదేశాలుగా గుర్తించారు. స్వచ్ఛభారత్‌ మిషన్‌ కింద దేశంలోని 100 ప్రసిద్ధ, వారసత్వ, ఆధ్యాత్మిక, సాంస్కృతిక ప్రదేశాల్లో పరిశుభ్రతపై కేంద్రం దృష్టి సారించిన విషయం తెలిసిందే.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top