డబ్బుల పంపకంపై కేంద్ర ఎన్నికల సంఘం సీరియస్
ఘటనపై మళ్లీ నివేదిక పంపాలని జిల్లా కలెక్టర్కు ఆదేశం
సాక్షి, న్యూఢిల్లీ: నంద్యాల ఉప ఎన్నిక ప్రచారంలో ఓటర్లకు ఎమ్మెల్యే బాలకృష్ణ పబ్లిక్గా డబ్బులు పంపిణీ చేయడాన్ని కేంద్ర ఎన్నికల సంఘం తీవ్రంగా పరిగణించింది. ఈ ఘటనపై నివేదిక సమర్పించాలని జిల్లా కలెక్టర్ను ఆదేశించింది. దేశవ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లో జరుగుతున్న ఉప ఎన్నికలపై కేంద్ర ఎన్నికల సంఘం శనివారం ఆయా రాష్ట్రాల ఎన్నికల కమిషనర్లతో సమీక్ష నిర్వహించింది. ఈ సందర్భంగా నంద్యాల ఉప ఎన్నికల ప్రచారంలో బాలకృష్ణ ఓటర్లకు డబ్బులు పంచడంపై అందిన ఫిర్యాదులను పరిశీలించిన ఎన్నికల కమిషన్.. ఈ ఘటనపై పూర్తి నివేదిక ఇవ్వాలని జిల్లా కలెక్టర్ను ఆదేశించింది.
సమావేశానికి హాజరైన రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి భన్వర్లాల్ మీడియాతో మాట్లాడుతూ.. ఎన్నికల్లో అక్రమాలకు పాల్పడితే సహించేది లేదని చెప్పారు. ఎవరైనా నిబంధనలు అతిక్రమిస్తే చర్యలు తీసుకుంటామని, అందులో భాగంగానే ఒక డీఎస్పీని బదిలీ చేశామని తెలిపారు. వీవీప్యాట్ల నుంచి వచ్చే స్లిప్పులను వేరేవాళ్లు చూస్తారన్నది కేవలం దుష్ప్రచారమేనని చెప్పారు. ఓటరు మినహా ఎవరూ ఆ స్లిప్పులు చూసే అవకాశం లేదని, స్లిప్పులన్నింటినీ ఎన్నికల సంఘమే భద్రపరుస్తుందని తెలిపారు. సర్వేలు ఆపాలని ఆదేశించే అధికారం ఎన్నికల సంఘానికి ఉందన్నారు. దీనిపై కోర్టులో తమ వాదనను వినిపిస్తామని ఆయన చెప్పారు.