పోలీస్స్టేషన్లలో సీసీటీవీ కెమెరాలు
సాక్షి, ముంబై : రాష్ట్రవ్యాప్తంగా ఉన్న పోలీస్స్టేషన్లలో కస్టడీ మరణాలను అరికట్టేందుకు సీసీ టీవీ కెమెరాలను అమర్చాలని బాంబే హైకోర్టు ఇటీవల ఆదేశించింది. దీనివల్ల పోలీస్ కస్టడీలో ఖైదీలపై వేధింపులు కూడా కొంతమేర నివారించవచ్చని హైకోర్టు తెలిపింది. బీపీటీ కాలనీకి చెందిన లియోనార్డ్ వల్దారిస్ తన 25 ఏళ్ల కొడుకు అనుమానాస్పద మృతిపై సీబీఐ దర్యాప్తు కోరుతూ పిటిషన్ దాఖలు చేశాడు.
అతని కొడుకు ఆగ్నేలోతోపాటు మరో ముగ్గురిని వడాలా గవర్నమెంట్ రైల్వే పోలీసులు(జీఆర్పీ) చైన్ స్నాచింగ్ కేసు కింద తీసుకెళ్లారు. కాగా పోలీస్ కస్టడీలో ఆగ్నేలోను విపరీతంగా వేధింపులకు గురి చేయడంతో అతను మరణించాడు. దీంతో వడాలా జీఆర్పీకి చెందిన ఏడుగురు సిబ్బందిపై ఎఫ్ఐఆర్ను నమోదు చేశారు. వెంటనే హైకోర్టు ఈ కేసును సెంట్రల్ బ్యారో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సీబీఐ)కు బదిలీ చేసింది. అలాగే రాష్ట్రంలోని ప్రతి పోలీస్స్టేషన్లలో ప్రతి మూలను కూడా కవర్ చేసే విధంగా సీసీ టీవీ కెమరాలను అమర్చాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది.