కార్పొరేషన్ ఎన్నికల్లో బీజేపీ జయకేతనం
ముంబై: దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాల్లో కమల వికాసం కొనసాగుతున్న తరుణంలో మహారాష్ట్ర స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా తన హవా చూపింది. సోమవారం వెలువడిన మిరా భయందర్ మున్సిపల్ కార్పొరేషన్ ఫలితాల్లో అత్యధిక స్థానాలు కైవసం చేసుకుని భారతీయ జనతా పార్టీ జయకేతనం ఎగురవేసింది.
మొత్తం 95 స్థానాలకు గానూ 61 బీజేపీ కైవసం చేసుకోవటం విశేషం. శివసేన కేవలం 22 స్థానాలతో సరిపెట్టుకుంది. ఇవి పేరుకు మిత్రపక్షాలే అయినప్పటికీ స్థానిక సంస్థల ఎన్నికల్లో మాత్రం విడివిడిగానే పోటీచేస్తున్న విషయం తెలిసిందే. ఇక కాంగ్రెస్ 10 సీట్లు గెలుచుకోగా, ఎన్సీపీ, ఎంఎన్ఎస్ సింగిల్ సీటు కూడా గెలుచుకోలేక ఢీలా పడిపోడ్డాయి. ఇక విజయంపై ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్ స్పందించారు. బీజేపీ సాధించిన భారీ విజయం, విశ్వాస్-వికాస్ అంటూ మోదీ ఇచ్చిన పిలుపునకు ప్రజలు మళ్లీ పట్టాం కట్టారని ట్విట్టర్లో ట్వీట్ చేశాడు.
2012 లో ఇదే కార్పొరేషన్ కు జరిగిన పోల్ లో బీజేపీ 32 స్థానాలు గెల్చుకోగా, సేన 15 సీట్లు కైవసం చేసుకుంది. కాంగ్రెస్ 19, ఎన్సీపీ 26 సీట్లు గెలుచుకున్నాయి.