బీజేపీ-కాంగ్రెస్ మాటల యుద్ధం
న్యూఢిల్లీ: కర్ణాటక ఐఏఎస్ ఆఫీసర్ డీకె రవి అనుమానస్పద మృతిపై లోక్సభలో వివాదం రేగింది. బీజేపీ, కాంగ్రెస్ సభ్యుల మాటల యుద్ధం నడిచింది. ఇది ముమ్మాటికే హత్యే అంటూ బీజేపీ ఎంపీ ప్రహ్లాద్ జోషీ కర్ణాటక ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. సీబీఐ విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. దీంతో కాంగ్రెస్ సభ్యులు నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా హోంమంత్రి రాజ్ నాథ్ సింగ్ జోక్యం చేసుకుని కర్ణాటక సీఎం సిద్ధరామయ్య కోరితే సీబీఐ విచారణకు కేంద్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందని ప్రకటించారు. తాను ముఖ్యమంత్రితో నిరంతరం మాట్లాడుతున్నానని.. రెండు రోజుల్లో దీనిపై పూర్తి నివేదిక పంపుతామన్నారని వివరణ ఇచ్చారు. అయినా సభ్యుల మధ్య వాగ్యుద్ధం సద్దుమణగక పోవడంతో స్పీకర్ సభను కొద్ది సేపు వాయిదావేశారు.
ఇది ఇలా వుంటే... సీబీఐ విచారణకు ప్రభుత్వం అంగీకరించపోవడంతో ఏబీవీపీ ఆధ్యర్యంలో బెంగళూరులో విద్యార్థులు ఆందోళన నిర్వహించారు. పరిస్థితి హింసాత్మకంగా పోలీసులు లాఠీచార్జి చేసి ఆందోళనకారులను చెదరగొట్టారు. డీకె రవి సొంతజిల్లా తుంకూర్ లో పోలీసులుకు , ఆందోళనకారులకు మధ్య ఘర్షణ వాతావరణం నెలకొంది.
కాగా తమ కొడుకు ఆత్మహత్య చేసుకునేంత పిరికివాడుకాదని, సీబీఐ విచారణ చేపట్టకపోతే ఆత్మహత్య చేసుకుంటామని డీకె రవి తల్లిదండ్రులు హెచ్చరించిన సంగతి తెలిసిందే.