'వాద్రా మోడల్ బాగుంటుందా'
బడా వ్యాపారవేత్తల పెట్టుబడుల వల్లే నరేంద్ర మోదీ ప్రధానిగా గెలిచారంటూ ప్రజాతీర్పును అపహాస్యం చేసిన కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ తక్షణమే జాతికి క్షమాపణ చెప్పాలని బీజేపీ డిమాండ్ చేసింది. ఆ పార్టీ సీనియర్ నేత, కేంద్ర మంత్రి రవిశంకర్ ప్రసాద్ ఆదివారం ఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ.. రాహుల్ వ్యాఖ్యలు వ్యవస్థను కించపరిచేలా ఉన్నాయన్నారు.
సోనియా గాంధీ అల్లుడు హోదాలో రాబర్ట్ వాద్రా హర్యానా ప్రభుత్వం నుంచి భూములు పొందడాన్ని ప్రస్తావిస్తూ 'గుజరాత్ మోడల్ అనుసరణీయం కాదంటున్న రాహుల్.. రాబర్డ్ వాద్రా మోడల్ ను ఫాలోకమ్మంటారా?' అంటూ వ్యంగ్యాస్త్రాలు సంధించారు. 'ప్రధాని నరేంద్రమోదీ తొమ్మిదిరోజులు విదేశాల్లో పర్యటించి భారీ ఎత్తున పెట్టుబడులను ఆకర్శించగలిగారు. అదే రాహుల్ గాంధీ ఇన్నిరోజులు ఏం చేశారు? కనీసం ఆత్మపరిశీలనైనా చేసుకున్నారా?' అని ప్రశ్నించారు.