అధికార పార్టీ ఎమ్మెల్యే అరెస్ట్
సాక్షి, భువనేశ్వర్: సీషోర్ గ్రూప్ కుంభకోణంలో కేంద్ర దర్యాప్తు సంస్థ(సీబీఐ) మరో ముందడుగు వేసింది. అధికార పార్టీ బిజు జనతా దళ్(బీజేడీ) ఎమ్మెల్యే ప్రభాత్ బిస్వాల్ను సోమవారం రాత్రి అరెస్ట్ చేసింది. 500 కోట్ల విలువైన ఈ భారీ కుంభకోణంలో ప్రభాత్ పేరు గత కొంతకాలంగా వార్తల్లో వినిపిస్తున్న విషయం తెలిసిందే.
చౌదర్-కటక్ నియోజక వర్గ ఎమ్మెల్యే అయిన ప్రభాత్కు షీషోర్ గ్రూప్ అధినేత ప్రశాంత్ దాష్కు మధ్య ఓ భూమికి సంబంధించి లావాదేవీలు జరిగాయి. ఈ నేపథ్యంలో ప్రభాత్, ఆయన భార్యను గతేడాది నవంబర్లోనే సీబీఐ ప్రశ్నించింది కూడా. అయితే ఆ సమయంలో ఆర్థిక వ్యవహారలపై ఆ దంపతులు నోరు మెదపకపోగా.. తర్వాత విచారణలో అవి బయటపడ్డాయి. దీంతో ప్రభాత్ను దర్యాప్తు సంస్థ అరెస్ట్ చేసింది.
ఒడిశాలోని 44 పోంజీ కంపెనీలలో సీషోర్ గ్రూప్ ఒకటి. సంచలన రేపిన ఈ కుంభకోణం 2014లో ఎండోర్స్ మెంట్ డిపార్ట్ మెంట్ విచారణతో వెలుగులోకి వెలుగులోకి రావటం.. పైగా అధికార పక్షానికి చెందిన నేతల హస్తం ఉందని తేలటంతో కలకలం రేపింది. దీనికి తోడు నవీన్ పట్నాయక్ మాజీ సహచరుడు సరోజ్ కుమార్ సాహూపై ఎలక్ట్రానిక్ సాక్ష్యాధారాలను కూడా సీబీఐ సేకరించింది. ఈ నేపథ్యంలో సీఎం కార్యాలయం కూడా ఈ స్కాంలో భాగస్వామిగా మారిందా? అన్న అనుమానాలు వ్యక్తం అయ్యాయి. ఈ యేడాది జనవరిలో మొత్తం 36 ప్రాంతాల్లో సీబీఐ తనిఖీలు నిర్వహించగా, అందులో ఎమ్మెల్యే ప్రభాత్ నివాసం కూడా ఉంది.