‘ఈ దేశానికి మేమే శాసకులం’

‘ఈ దేశానికి మేమే శాసకులం’


‘మేరే సాత్‌ కహో–హమ్‌ ఇస్‌ దేశ్‌కా శాసక్‌ హై (నాతో గొంతు కలిపి చెప్పండి. మనం ఈ దేశానికి పాలకులం) అంటూ ‘భీమ్‌ ఆర్మీ’ నాయకుడు, 30 ఏళ్ల యువకుడు చంద్రశేఖర్‌ ఇటీవల జంతర్‌ మంతర్‌ వద్ద పిలుపునివ్వగానే వేలాది మంది యువకులు ‘హమ్‌ ఇస్‌ దేశ్‌కా శాసక్‌ హై’ అంటూ నినదించారు. ప్రస్తుతం ఉవ్వెత్తున లేచిన భీమ్‌ ఆర్మీ ఉద్యమాన్ని ఎలా ఆపాలి లేదా ఎలా తమ సానుకూలంగా మలుచుకోవాలనే అంశంపై ఢిల్లీలో కాంగ్రెస్, బీజేపీ నేతలు అంతర్గత చర్చలు జరపడమే అందుకు సాక్ష్యం. భీమ్‌ ఆర్మీని ఇప్పటికే బీజేపీ తొత్తు సంస్థగా ఆరోపణలు చేసి నాలుక కరుచుకున్న బీఎస్పీ నాయకురాలు మాయావతి వారిని ఎలా తన వైపు తిప్పుకోవాలనే అంశంపై ఆలోచిస్తున్నారు.



ప్రస్తుతం యూపీకే పరిమితమైన భీమ్‌ ఆర్మీ ఢిల్లీలో లక్షలాది మంది యువకులతో భారీ సమావేశాన్ని నిర్వహించడం ద్వారా తాము ఇతర రాష్ట్రాలకు కూడా విస్తరిస్తామన్న సంకేతాలను ఇచ్చింది. లా డిగ్రీ చదివిన చంద్రశేఖర్‌ రెండేళ్ల క్రితం, అంటే 2015లో ‘ది గ్రేట్‌ చామర్స్‌ ఆఫ్‌ దడ్కౌలి వెల్‌కమ్స్‌ యు’ అన్న బోర్డును ఇంటిముందు వేలాడదీయడం ద్వారా అందరినీ ఆకర్షించారు. ఆయనది సహరాన్‌పూర్‌ పరిధిలోని దడ్కౌలి గ్రామమే. ఆయన ఇంటికి దళిత యువకులు ఎక్కువగా రావడం మొదలైంది. దాంతో ఆయన ‘భీమ్‌ ఆర్మీ’ని ఏర్పాటు చేశారు. దళితులు అభివృద్ధి చెందాలంటే ముందుగా చదువులో రాణించాలని ఆశించిన చంద్రశేఖర్‌ దళితులకు ఉచితంగా చదువు చెప్పే కేంద్రాలను ఏర్పాటు చేశారు. ప్రస్తుతం భీమ్‌ ఆర్మీ ఆధ్వర్యంలో అలాంటివి దాదాపు 300 కేంద్రాలు నడుస్తున్నాయి. ఇంతకాలం చదువు మీదనే దృష్టిని కేంద్రీకరించిన ఈ ఆర్మీ యోగి ఆదిత్యనాథ్‌ ముఖ్యమంత్రయ్యాక రాజకీయ, సామాజిక అంశాలపై తమ దృష్టిని కేంద్రీకరించింది.




ఉత్తరప్రదేశ్‌లోని సహరాన్‌పూర్‌లో మే 9వ తేదీన ఠాకూర్లకు వ్యతిరేకంగా నిర్వహించిన నిరసన ర్యాలీ ద్వారా భీమ్‌ ఆర్మీ నాయకుడు చంద్రశేఖర్‌ కాస్త ఒక్కసారిగా పెద్ద నాయకుడై చంద్రశేఖర్‌ ఆజాద్‌గా అభిమానులు పిలుచుకునే స్థాయికి ఎదిగిపోయారు. చంద్రశేఖర్‌ మాత్రం తనకు తాను రావన్‌ అని చెప్పుకుంటారు. మే 6న దళితులకు చెందిన 25 గుడిసెలను ఠాకూర్లు దహనం చేయడాన్ని నిరసిస్తూ 9వ తేదీన భీమ్‌ ఆర్మీ ర్యాలీని నిర్వహించింది. ముఖ్యమంత్రి ఆదిత్యనాథ్‌ కూడా ఠాకూర్‌ కులానికి చెందినవారు కావడంతో పోలీసులు ఓవర్‌ యాక్షన్‌ చేశారు. ర్యాలీని అణచివేతలో ఓ దళిత యువకుడు మరణించారు. మే ఐదో తేదీన ఓ ఠాకూర్‌ యువకుడిని దళితులు కొట్టి చంపడం వల్లనే తాము వారి గుడిసెలను తగులబెట్టామని ఠాకూర్లు అంటున్నారు.  



ఠాకూర్లపై ఒక్క కేసు కూడా నమోదు చేయని స్థానిక పోలీసులు చంద్రశేఖర్‌పై మాత్రం 24 ఎఫ్‌ఐఆర్‌లు దాఖలు చేశారు. అల్లర్లను అరికట్టడంలో విఫలమయ్యారంటూ జిల్లా కలెక్టర్‌ను, జిల్లా పోలీసు అధికారిని ముఖ్యమంత్రి యోగి విధుల నుంచి సస్పెండ్‌ చేశారు. జిల్లా బీజేపీ నాయకులను, క్రియాశీలక కార్యకర్తలను కొంతకాలం సహరాన్‌పూర్‌కు దూరంగా ఉండాలంటూ కూడా యోగి సూచించినట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. ఈ దశలో చంద్రశేఖర్‌ను అణచివేసేందుకు ప్రయత్నిస్తే అనవసరంగా అతను పెద్ద నాయకుడవతారన్నది ఆయన ఆందోళనట. భీమ్‌ ఆర్మీ తమ ఉనికిని కూడా దెబ్బతీసే ప్రమాదం ఏర్పడిందని కాంగ్రెస్‌ పార్టీ షెడ్యూల్‌ కులాల విభాగం చైర్మన్‌ కొప్పుల రాజు వ్యాఖ్యానించారు. ఇంతకాలం దళితులను ఓటు బ్యాంకుగా పరిగణిస్తూ వచ్చిన జాతీయ పార్టీలకు భీమ్‌ ఆర్మీ ఓ మేలుకొలుపని జేడీయూ అధికార ప్రతినిధి కేసీ త్యాగి వ్యాఖ్యానించారు.



తీవ్ర అణచివేతకు గురైనప్పుడు, పార్టీలు వారి ప్రయోజనాలను పట్టించుకోనప్పుడు భీమ్‌ ఆర్మీ లాంటి ఉద్యమాలు పుట్టుకొస్తాయని సీపీఐ సీనియర్‌ నాయకుడు డి. రాజా వ్యాఖ్యానించారు. భీమ్‌ ఆర్మీ వల్ల బీజేపీకి కూడా భారీ నష్టమేనేనని పేరు బహిర్గతం చేయడానికి ఇష్టపడని ఓ పార్టీ నాయకుడు వ్యాఖ్యానించారు. గోరక్షకుల దాడుల వల్ల ఇప్పటికే దళితులు పార్టీకి దూరమవుతున్నారన్నారు. అయినా భీమ్‌ ఆర్మీ లాంటి ఉద్యమాలు ఏదో ఒక పార్టీని ఆశ్రయిస్తే తప్ప ఎక్కువకాలం మనుగడ సాగించలేవన్నారు. రానున్న గుజరాత్, కర్ణాటక ఎన్నికలను దృష్టిలో పెట్టకొని ప్రధాని నరేంద్ర మోదీ, పార్టీ అధ్యక్షుడు అమిత్‌ షా వెళ్లిన చోటల్లా దళితుల గురించే మాట్లాడుతున్నారు. భీమ్‌ ఆర్మీలోకి మైనారిటీలైన ముస్లిం యువకులను ఆహ్వానించడం రాజకీయ పార్టీలకు కొరుకుడు పడని మరో అంశం. ఇప్పటికే భీమ్‌ ఆర్మీలో ఏడు శాతం ముస్లిం యువకులు ఉన్నారు. ప్రస్తుతం 18 నుంచి 25 ఏళ్ల మధ్య వయస్కులనే భీమ్‌ ఆర్మీలోకి తీసుకుంటున్నారు.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top