'డబ్బులిస్తాం రా' అని ఇంటికి పిలిచి..
జైపూర్: రాజస్థాన్లో దారుణం చోటుచేసుకుంది. తాను అప్పుగా ఇచ్చిన డబ్బును తిరిగి చెల్లించమన్నందుకు ఓ వ్యక్తి మూకతో కలిసి ఆ డబ్బులిచ్చిన వ్యక్తిపై దాడి చేశాడు. కిందపడేసి కర్రలతో పశువును కొట్టినట్లు కొట్టారు. దీంతో అతడి కాలు విరిగిపోగా చేతికి, శరీరానికి తీవ్ర గాయాలు అయ్యాయి. దీనికి సంబంధించిన వీడియో ఒకటి ఇప్పుడు వెలుగులోకి వచ్చి ఆన్ లైన్ లో చక్కెర్లు కొడుతోంది. దీనిని చూసిన పలువురు నెటిజన్లు బాధితుడిపై జాలి చూపిస్తూ దాడి చేసిన వ్యక్తులపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
వివరాల్లోకి వెళితే.. రమేశ్ జాట్ అనే వ్యక్తి రాజస్థాన్ లోని బిల్వారా జిల్లా కోషితాల్ గ్రామానికి చెందినవాడు. ఇతడు జబార్కియా అనే గ్రామానికి చెందిన మిత్తులాల్ జాట్ అనే వ్యక్తికి రూ.30 వేలు అప్పుగా ఇచ్చాడు. అయితే, తన ఇళ్లును బాగు చేయించుకునే ఉద్దేశంతో వాటిని తిరిగి ఇవ్వాలని కోరాడు. అయితే, మిత్తులాల్ కుమార్తె లక్ష్మీ ఫోన్ చేసి 'డబ్బులిస్తాం ఇంటికి రాండి' అని పిలిచారు. దీంతో అక్కడికి వెళ్లిన రమేశ్ పై మొత్తం కుటుంబ సభ్యులంతా కలిసి కర్రలతో విచక్షణ రహితంగా దాడి చేయడమే కాకుండా కాళ్లతో పొర్లిచ్చి తన్నారు. దీంతో అతడు తీవ్ర గాయాలపాలై ఆస్పత్రిలో చేరాడు. ఈ మేరకుకు పోలీసులు వారిపై కేసులు నమోదు చేశారు.