తొలి మహిళా క్యాబ్ డ్రైవర్ ఎందుకు చనిపోయిందంటే..
బెంగళూరు: బెంగళూరులో అనుమానాస్పద స్థితిలో ఆత్మహత్యకు పాల్పడిన తొలి మహిళా క్యాబ్ డ్రైవర్ వీరత్ భారతి గురించి పలు ఆసక్తికరమైన అంశాలు వెలుగులోకి వచ్చాయి. ఆమె ఆత్మహత్యకు పాల్పడటానికి గల కారణం ఒంటరితనం, మానసిక ఒత్తిడి అని చెబుతున్నారు. భారతి లింగమార్పిడి చేసుకున్నారని(స్త్రీ నుంచి పురుషుడిగా), ఆమె గత నాలుగేళ్లుగా నిమ్మి(పేరు మార్చాం) అనే ఓ మహిళతో కలిసి ఉంటోందని, ఇటీవలె వారి మధ్య విభేదాలు తలెత్తి నిమ్మి వెళ్లిపోయిందని ఆమె స్నేహితులు చెబుతున్నారు.
ఒకసారి వారి మధ్య తీవ్రంగా గొడవ జరిగిందని, భౌతికంగా భారతిపై నిమ్మి దాడి కూడా చేసిందని, ఈ మధ్య బహిరంగంగా కూడా ఆమెపై చేయిచేసుకుందని, ఆ తర్వాత వెళ్లిపోయి వేరే వ్యక్తితో ఉంటోందని చెప్పారు. బహుశా ఈ విషయం ఆమెను తీవ్ర మానసిక ఒత్తిడికి గురిచేసి ఉండొచ్చని చెబుతున్నారు. ఇటీవలె తన సొంత గ్రామానికి కూడా వెళ్లిపోవాలని నిర్ణయించుకున్నట్లు స్నేహితులు చెప్పారు. ఆమెకు తెలిసిన వెంకటేశ్ అనే న్యాయవాదికి ఫోన్ చేసి ఒక చంటిబిడ్డను దత్తత తీసుకోవాలనుకుంటున్నానని, అందుకు సంబంధించిన న్యాయపరమైన సలహాలు ఇవ్వాలని కోరినట్లు తెలిసింది. ఈలోగా ఆమె ఆత్మహత్యకు పాల్పడింది. పోస్టు మార్టం నివేదిక వచ్చిన తర్వాతే పోలీసులు ఆమె విషయంపై స్పష్టతను ఇస్తారని చెప్పారు.