ఆ డాక్యుమెంటరీని ప్రసారం కానివ్వం!


న్యూఢిల్లీ: నిర్భయపై పాశవిక అత్యాచారానికి పాల్పడిన ముకేశ్ సింగ్ ఇంటర్వ్యూ ఉన్న డాక్యుమెంటరీని విదేశాల్లో సహా ఎక్కడా, ఏ విధంగానూ.. ప్రసారం కానీ, ప్రచురణ కానీ కాకుండా చూస్తామని కేంద్రప్రభుత్వం స్పష్టం చేసింది. సోషల్ మీడియా సహా ఎక్కడ, ఏ విధంగా కూడా ఆ డాక్యుమెంటరీ టెలికాస్ట్ కాకుండా చర్యలు తీసుకోవాలని బీబీసీ, భారతీయ విదేశాంగ శాఖ, సమాచార సాంకేతిక విభాగాలను కేంద్ర హోంమంత్రిత్వ శాఖ ఆదేశాలు జారీ చేసింది. ఎట్టి పరిస్థితుల్లో ఆ డాక్యుమెంటరీ ప్రసారం, ప్రచురణ కాకుండా చూస్తామని హోంమంత్రి రాజ్‌నాథ్ సింగ్ బుధవారం పార్లమెంటు ఉభయసభల్లో ప్రకటన చేశారు.    



దీనిపై దేశమంతా సిగ్గుపడుతోందంటూ ఆవేదన వ్యక్తం చేశారు. ఆ ఇంటర్వ్యూకు అనుమతి ఎలా లభించిందనే విషయంపై దర్యాప్తు చేసి, బాధ్యులపై చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. తీహార్ జైలు డెరైక్టర్ జనరల్ అలోక్ కుమార్ వర్మను రాజ్‌నాథ్ పిలిపించి వివరణ తీసుకున్నారు. కాగా, ఈ లఘుచిత్రాన్ని ఈ నెల 8వ తేదీన మహిళాదినోత్సవం సందర్భంగా ప్రసారం చేయాలనుకున్న బీబీసీ.. అంతకన్నా ముందుగానే బుధవారం రాత్రి 10 గంటలకు బ్రిటన్‌లో ప్రసారం చేయాలని నిర్ణయించినట్లు ఒక ప్రకటనలో తెలిపింది. తమపై చర్య తీసుకునే ముందు ప్రధాని మోదీ ఆ లఘు చిత్రాన్ని ఒకసారి చూడాలని కోరింది.

 

మహిళాసభ్యుల వాకౌట్

ఈ ఉదంతంపై బుధవారం పార్లమెంటు అట్టుడికింది. ముఖ్యంగా మహిళా సభ్యులు దీనిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తీహార్ జైళ్లో ఉన్న గ్యాంగ్ రేప్ దోషిని ఇంటర్వ్యూ చేసేందుకు అనుమతి లభించడానికి కారణమైన వారిపైచర్యలు తీసుకోవాలని  ప్రతిపక్ష సభ్యులు ఆందోళన చేశారు. ఆ డాక్యుమెంటరీలో అశ్లీల పదజాలం వాడటాన్ని బార్‌కౌన్సిల్ దృష్టికి తీసుకువెళ్తామని పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి వెంకయ్యనాయుడు చెప్పారు. దీనిపై ప్రభుత్వం తీసుకున్న చర్యలపై అసంతృప్తి వ్యక్తం చేస్తూ రాజ్యసభలో విపక్ష పార్టీలకు చెందిన మహ ళా సభ్యులంతా వెల్‌లోకి దూసుకెళ్లారు.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top