నోట్లపై రాతలున్నా తీసుకోవాలి: ఆర్బీఐ
ముంబై: కరెన్సీ నోట్లు రంగు వెలిసినా, వాటిపై రాతలు ఉన్నా బ్యాంకులు వాటిని తీసుకోవాలని ఆర్బీఐ ఆదేశాలు జారీ చేసింది. అలాంటి నోట్లను ‘మాసిన నోట్లు’గా పరిగణించి ‘స్వచ్ఛ నోటు విధానం’ ప్రకారం వ్యవహరించాలని పేర్కొంది. కరెన్సీ నోట్లను.. ముఖ్యంగా రాతలున్న రూ.500, రూ.2,000 నోట్లను బ్యాంకు స్వీకరించడం లేదని ఫిర్యాదులు రావడంతో ఆర్బీఐ ఈమేరకు ఆదేశాలు జారీ చేసింది.
రాతలున్న నోట్లను బ్యాంకులు 2017 నుంచి స్వీకరించబోవన్న వదంతులను కొట్టిపారేస్తూ తాను 2013లో జారీ చేసిన ప్రకటనను ఈ సందర్భంగా ప్రస్తావించింది. నోట్లపై రాయకూడదని బ్యాంకు సిబ్బందికి ఆదేశాలిచ్చామని పేర్కొంది. నోట్లను స్వచ్ఛంగా ఉంచేందుకు అన్ని వర్గాల ప్రజలు సహకరించాలని ఆర్బీఐ కోరింది.