జనవరిలో బ్యాంకు ఉద్యోగుల సమ్మె
చెన్నై: తమ వేతనాల పెంపుపై సత్వర పరిష్కారాన్ని కోరుతూ బ్యాంకు ఉద్యోగులు జనవరిలో ఐదు రోజుల సమ్మెకు దిగనున్నారు. జనవరి 7న ఒక రోజు సమ్మెతో నిరసన తెలియజేయాలని ఈ నెల 17న ముంబైలో జరిగిన ఉద్యోగ సంఘాల (యూఎఫ్బీయూ) భేటీలో నిర్ణయించినట్లు అఖిల భారత బ్యాంకు ఉద్యోగుల సంఘం (ఏఐబీఈఏ) ప్రకటించింది. జనవరి 21 నుంచి 24వ తేదీ వరకు వరుసగా నాలుగు రోజులు సమ్మె తలపెట్టామని, అప్పటికీ పరిష్కారం లభించకుంటే మార్చి 17 నుంచి నిరవధిక సమ్మెకు వెళ్లాలని నిర్ణయించినట్లు పేర్కొంది. వేతన పెంపునపై చర్చల్లో ఇండియన్ బ్యాంక్స్ అసోసియేషన్ కాలయాపన ధోరణిపై భేటీ అసంతృప్తి వ్యక్తం చేసినట్లు వెల్లడించింది.