వాటిని బ్యాంకు వేలం వేయదు
-
లతా రజనీకాంత్ ఆస్తులపై మీడియా వన్ గ్లోబల్ స్పష్టీకరణ
సాక్షి, చెన్నై: తమిళ సూపర్స్టార్ రజనీకాంత్ భార్య లతా రజనీకాంత్ ఆస్తులను బ్యాంకు వేలం వేసే అవకాశం ఉండదని మీడియా వన్ గ్లోబల్ ఎంటర్టైన్మెంట్ సంస్థ శనివారం తెలిపింది. లతా రజనీకాంత్ ఆస్తుల వేలం అంటూ శుక్రవారం మీడియాలో ప్రచారం సాగడంతో చిత్ర పరిశ్రమలో కలకలం రేగింది. రజనీకాంత్ హీరోగా నటించిన కొచ్చాడియాన్ చిత్రాన్ని ఎరోస్ ఇంటర్నేషనల్ సంస్థతో కలసి మీడియా వన్ గ్లోబల్ ఎంటర్టైన్మెంట్ సంస్థ నిర్మించింది. అయితే ఈ చిత్ర నిర్మాణం కోసం మీడియా వన్ సంస్థ ఓ ప్రైవేటు బ్యాంకు నుంచి రూ. 20 కోట్ల రుణం తీసుకుంది.
అందుకు లతా రజనీకాంత్కు చెందిన ఆస్తుల డాక్యుమెంట్లను పూచీకత్తుగా అందించారు. కొచ్చాడియాన్ చిత్రం విడుదల తరువాత కూడా మీడియావన్ రుణం చెల్లించలేదు. దీంతో శుక్రవారం ఒక ప్రకటన విడుదల చేసిన బ్యాంకు.. మీడియా వన్ సంస్థ నుంచి సుమారు రూ. 22 కోట్లు రావలసివుందని, ఆ సంస్థ ఈ మొత్తాన్ని చెల్లించకుంటే పూచీకత్తుగా పెట్టిన లతా రజనీకాంత్ ఆస్తులను వేలం వేస్తామని ప్రకటించింది.
ఈ ఆస్తులపై లతా రజనీకాంత్గానీ, మరెవరైనాగానీ క్రయ విక్రయాలు నిర్వహించడంపై నిషేధం విధించినట్లు పేర్కొంది. దీంతో ఈ వ్యవహారంపై మీడియా వన్ స్పందిస్తూ సంబంధిత బ్యాంకు నుంచి రూ. 20 కోట్లు రుణం తీసుకున్నమాట వాస్తవమేనని, ఈ మొత్తాన్ని తిరిగి చెల్లించడానికి ఏర్పాట్లు చేస్తున్నామని వెల్లడించింది. దీనిపై బ్యాంకు అధికారులతో చర్చిస్తున్నామని, తాము రుణం చెల్లించనుండటంతో లతా రజనీకాంత్ ఆస్తుల్ని బ్యాంకు వేలం వేసే అవకాశం లేదన్నారు. కాగా, రుణం చెల్లించడానికి ఈ సంస్థకు బ్యాంకు నెల రోజుల గడువు ఇచ్చినట్టు సమాచారం.