అయ్యో..! రాత్రికి రాత్రే బెంగళూరులో కూడా..
బెంగళూరు: ఓపక్క ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల కారణంగా ఢిల్లీకి సమీపంలోని గుర్గావ్ లోని రోడ్లన్ని వరద నీటిలో మునిగి రాకపోకలకు తీవ్ర అంతరాయం కలగగా ఇప్పుడు తాజాగా బెంగళూరులో అలాంటి పరిస్థితే తలెత్తింది. రాత్రికి రాత్రే కురిసిన భారీ వర్షం కారణంగా బెంగళూరులోని పలు ఐటీ కంపెనీలు వర్షపు నీటిలో చిక్కుకున్నాయి. ఇన్ఫోసిస్, ఎలక్ట్రానిక్ సిటీ, పలు నివాసాలకు వెళ్లే మార్గం లేకుండా అయింది.
కనీసం నిత్యావసరాలు కూడా తెచ్చుకునే పరిస్థితి లేకుండా వరద నీరు వచ్చి చేరింది. దీంతో అగ్నిమాపక సిబ్బంది బోట్లను రంగంలోకి దించింది. వాటి సహాయంతో ప్రమాద పరిస్థితుల్లో ఉన్నవారిని సురక్షిత ప్రాంతాలకు తరలిస్తుంది. దీనికి తోడు ఎక్కడికక్కడ విరిగిపోయిన చెట్ల కారణంగా వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడుతోంది. విద్యుత్ సమస్య కూడా మొదలైంది. ఎక్కడ చూసిన వరద నీరు మీటర్ల పరిధిలో వ్యాపించి ఉండటంతో అధికారులు ఆందోళన చెందుతున్నారు.