వివక్షతో బతకలేం: లోక్‌సభలో ఓవైసీ

అసదుద్దీన్ ఓవైసీ


న్యూఢిల్లీః  రిజర్వేషన్లు లేకున్నా బతకొచ్చు గానీ, వివక్షతో మాత్రం బతకలేమని ఎంఐఎం ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ ఆందోళన వ్యక్తంచేశారు. ఎస్సీ బిల్లు సవరణపై గురువారం లోక్‌సభలో జరిగిన చర్చలో ఆయన పాల్గొన్నారు. ముస్లింలకు రిజర్వేషన్లు కల్పించాలంటూ న్యాయమైన డిమాండ్ ముందుకొస్తున్న సందర్భాల్లో మతపరమైన రిజర్వేషన్లంటూ సాకు చూపుతున్న ప్రభుత్వాలు 1950 నాటి ప్రెసిడెన్షియల్ ఉత్తర్వుల్లో ఉన్న మతపరమైన అంశాలను ఎందుకు ప్రశ్నించడం లేదని ప్రశ్నించారు. ముస్లింలకు రిజర్వేషన్లు కల్పించాలన్న డిమాండ్ వచ్చినప్పుడల్లా మతపరమైన రిజర్వేషన్లు రాజ్యాంగ విరుద్ధమంటూ పక్కకు పెడుతున్నారని ఆవేదన వ్యక్తంచేశారు.



గతంలో తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత ముస్లిం, క్రిష్టియన్ మతాల్లోని దళితులకు కూడా రిజర్వేషన్లు కల్పిస్తూ చట్టం చేసిందని, కేంద్ర ప్రభుత్వ అనుమతి కూడా కోరారని గుర్తుచేశారు. సుప్రీం కోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి రంగనాథ్ మిశ్రా నేతృత్వంలోని కమిటీ ఈ విషయమై పలు సిఫారసులు చేసినా కేంద్ర ప్రభుత్వం ఇప్పటివరకు సుప్రీం కోర్టుకు జవాబు చెప్పలేదని వాపోయారు. మహారాష్ట్రలోని అహ్మద్‌నగర్ జిల్లాలోని ఓ గ్రామంలో మూడు దళిత కుటుంబాలను గుర్తు తెలియని వ్యక్తులు ముక్కలు ముక్కలుగా నరికి చంపితే ఇప్పటివరకు ప్రభుత్వం దోషులను ఆరెస్టు చేయలేదని ఆందోళన వ్యక్తంచేశారు. రిజర్వేషన్లు లేకుండా కూడా ముస్లిం మైనారిటీలు బతకగలరు గానీ వివక్షతో మాత్రం బతకలేరని ఆవేదన వ్యక్తంచేశారు. రిజర్వేషన్లు కల్పించకుండా మతాన్ని సాకుగా చూపడం తగదని ఓవైసీ అన్నారు.

**

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top