ఆర్మీ అధికారి అదృశ్యం
పట్నా: బిహార్ కు చెందిన సైనిక అధికారి ఒకరు అదృశ్యం కావడం కలకలం రేపింది. ఆర్మీ కెప్టెన్ శిఖర్ దీప్ నెలరోజుల సెలవు తర్వాత తిరిగి విధుల్లోకి చేరేందుకు ఈ నెల ఆరో తేదీన ఢిల్లీకి బయలుదేరారు. కతిహార్ నుంచి మహానంద్ ఎక్స్ప్రెస్ రైలెక్కిన ఆయన తిరిగి ఢిల్లీకి చేరలేదు. నాలుగు రోజులైనా ఆయన ఆచూకీ తెలియకపోవడంతో.. కుటుంబసభ్యులు ఆందోళనలోమునిగిపోయారు. దీనిపై శిఖర్ బంధువు జిమ్మీ ప్రకాష్ పోలీసులకు ఫిర్యాదుచేశారు. పోలీసులు మిస్సింగ్ కేసు నమోదు చేసి దర్యాప్తు మొదలు పెట్టారు.
శిఖర్ను ఎవరైనా ఉగ్రవాదులు కిడ్నాప్ చేసి ఉంటారనే అనుమానాలను అధికారి తండ్రి, లెఫ్టినెంట్ కల్నల్ అనంత్ కుమార్ వ్యక్తంచేశారు.. అతని లగేజి మొత్తం బోగీలో ఉండగా, ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి ఉండటం మరింత ఆందోళన రేకెత్తిస్తోందన్నారు. మరోవైపు అన్ని కోణాల్లోనూ దర్యాప్తు నిర్వహిస్తున్నామని రైల్వే ఎస్పీ జితేంద్రమిశ్రా తెలిపారు.