ప్రాముఖ్యత తగ్గుతుందేమో
తన పాత్రకు ప్రాధాన్యత తగ్గుతుందేమో నన్న చింత నటి అంజలిని వెంటాడుతోందట. అందుకు కారణం లేకపోలేదు. ఈ అచ్చ తెలుగు ఆడపడచు కోలీవుడ్లో మంచి పేరు తెచ్చుకుంటున్న సమయంలో పినతల్లి భారతితో మనస్పర్థలు కారణంగా టాలీవుడ్కు వెళ్లిపోయిన విషయం తెలిసిందే. పలు సమస్యల తరువాత ఈ అమ్మడు ఎట్టకేలకు ఏడాది తరువాత తాజాగా కోలీవుడ్లో రీ ఎంట్రీ అయ్యారు. జయంరవి సరసన నటిస్తున్న ఈ చిత్రానికి సూరజ్ దర్శకత్వం వహిస్తున్నారు.
కాగా తన రీ ఎంట్రీ చిత్రంలో సోలో హీరోయిన్గా నటించే అవకాశం వచ్చిందని అంజలి తెగ సంతోషపడిపోయారు. ఆ తరువాత వరుసగా షాక్ల మీద షాక్లు తగిలాయి. దీంతో ఈ బ్యూటీ నిరుత్సాహానికి గురయ్యారు. విషయం ఏమిటంటే అంజలి నటిస్తున్న ఈ చిత్రంలోనే మరో హీరోయిన్గా త్రిషను ఎంపిక చేశారు. దీంతో అంజలికి కాస్త బెంగపట్టుకుందట. తాజాగా ఈ చిత్రంలో నటి పూర్ణ ఒక ప్రత్యేక సాంగ్లో నటించడం అదీ హీరో జయంరవితో పరిచయ పాటలో నటించడంతో అంజలికి చిత్రంలో తన ప్రాధాన్యత తగ్గిపోతుందనే చింత మరింత పెరిగిందనే ప్రచారం జోరందుకుంది.