అఖిలేశ్ సన్నిహిత ఎమ్మెల్సీపై వేటు
లక్నో: ఉత్తరప్రదేశ్ సీఎం అఖిలేశ్ యాదవ్ను పార్టీ జాతీయ అధ్యక్షుడిని చేయాలని డిమాండ్ చేస్తూ పార్టీ చీఫ్ ములాయంసింగ్యాదవ్కు లేఖ రాసిన ఎమ్మెల్సీ ఉదయ్ వీర్సింగ్పై శనివారం వేటు పడింది. అమర్యాదకర ప్రవర్తన, క్రమశిక్షణ ఉల్లంఘించినందుకు ఆరేళ్ల పాటు పార్టీ నుంచి బహిష్కరిస్తున్నట్టు ఎస్పీ ప్రతినిధి అంబికాచౌదరి తెలిపారు. శనివారం పార్టీ కార్యనిర్వాహక కమిటీ ప్రారంభ సమావేశం అనంతరం ఈ నిర్ణయం తీసుకున్నట్టు వెల్లడించారు.
ములాయంను కించపరిచేలా ఉదయ్వీర్ తన లేఖలో పదాలు వాడారని ఎస్పీ ప్రతినిధి భాటియా తెలిపారు. అఖిలేశ్తో ఉదయ్వీర్కు 30 ఏళ్ల అనుబంధం ఉంది. ‘పార్టీ రాష్ట్ర చీఫ్ శివ్పాల్యాదవ్, ఆయన కుటుంబం మిమ్మల్ని (ములాయం) తప్పుదోవ పట్టించి, అఖిలేశ్పై కుట్ర చేస్తున్నారు. అఖిలేశ్ను ఎస్పీ జాతీయ అధ్యక్షుడిని చేసి, ఆయనకు పూర్తి అధికారాలివ్వాలి’ అని ఇటీవల ఉదయ్వీర్ ములాయంకు లేఖ రాశారు. ములాయం రెండో భార్య గురించీ అనుచిత వ్యాఖ్యలు చేశారని సమాచారం.