యాసిడ్ అమ్మకాలపై ఆన్లైన్ పర్యవేక్షణ
లక్నో: మహిళలపై దాడులు పెరిగిపోతున్న నేపథ్యంలో యాసిడ్ అమ్మకాలను ఆన్లైన్ విధానంలో పర్యవేక్షించే వ్యవస్థను అమల్లోకి తేనున్నట్లు కేంద్ర హోంశాఖ మంత్రి రాజ్నాథ్సింగ్ తెలిపారు. ఈ విధానాన్ని తొలిగా ఢిల్లీలో ప్రారంభించనున్నామని చెప్పారు. శనివారం లక్నోలోని ఓ మహిళా కళాశాలలో జరిగిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. స్కూళ్లు, కాలేజీల్లో బాలికలకు ఆత్మరక్షణ విధానాలను నేర్పించాల్సి ఉందన్నారు. భద్రతా దళాల్లో మహిళలకు 33 శాతం ప్రాతినిధ్యం కల్పించేలా చూడాలంటూ రాష్ట్రాలకు సూచించినట్లు రాజ్నాథ్ తెలిపారు. ప్రస్తుతం పారామిలటరీ బలగాల్లో సిబ్బంది సంఖ్య 10 లక్షలు ఉండగా, అందులో మహిళల శాతం 1.4 శాతంగానే ఉందని, వచ్చే మూడేళ్లలో దీన్ని 5 శాతానికి పెంచుతామన్నారు.