పోటీలో ఉండాలా... వద్దా!
రాష్ట్రపతి పదవికి పోటీపై రెండు రకాల ప్రసంగాలు సిద్ధం చేసుకున్న కలాం
న్యూఢిల్లీ : అబ్దుల్ కలాం 2012 రాష్ట్రపతి ఎన్నికల్లో పోటీ చేయాలా, వద్దా? అన్న విషయంలో ఎంతో సంఘర్షణకు గురయ్యారు. పరిస్థితులు ప్రతికూలంగా ఉన్నాయన్న విషయం తెలిసిన ఆయన జాతినుద్దేశించి రెండు విభిన్నమైన ప్రసంగాలు సిద్ధం చేసుకున్నారు. పోటీ చేస్తే ఒక ప్రసంగం... చేయకపోతే మరో ప్రసంగం! ఆయన సహాయకుడిగా పనిచేసిన శ్రీజన్పాల్సింగ్ తన పుస్తకం ‘వాట్ కెన్ ఐ గివ్?: లైఫ్ లెసన్స్ ఫ్రమ్ మై టీచర్ ఏపీజే అబ్దుల్ కలామ్’లో ఈ అంశాలను ప్రస్తావించారు. కలాం తొలి వర్ధంతి నాడు (ఈ నెల 27) ఈ పుస్తక ఆవిష్కరణ జరగనుంది. పుస్తకం ప్రకారం.. కలాం పోటీ చేసేట్టయితే సుదీర్ఘ ప్రసంగాన్ని తయారు చేసుకున్నారు. ‘నా ప్రియమైన భారతీయులారా! మీ అందరితో కలసి ఈ ఎన్నికల్లో పోటీ చేయాలని నిర్ణయించుకున్నా.
అవసరమైన సంఖ్యా బలం లేదని తెలిసే బరిలో దిగుతున్నా. ఓడిపోతాననీ తెలుసు. కానీ.. ప్రజల హృదయాలను ఇప్పటికే గెలుచుకున్నా. కర్తవ్యనిర్వహణగా భావించి వారి కోసమే పోటీచేస్తున్నా. ఏ రాజకీయ పార్టీకీ చెందినవాడిని కాను. శాస్త్రవేత్తను మాత్రమే. ఓట్ల కోసం ఏ పార్టీ నేతనూ అర్థించను. మిమ్మల్నే అభ్యర్థిస్తున్నా..’ అని ప్రసంగం సిద్ధం చేసుకున్నారు. పోటీ నుంచి తప్పుకుంటే ఏం మాట్లాడాలన్నది కలాం క్లుప్తంగా రాసుకున్నారు. ‘మళ్లీ రాష్ట్రపతిగా సేవలందించాలని నేనెప్పుడూ అనుకోకపోయినా తృణమూల్ చీఫ్ మమతా బెనర్జీ, ఇతర పార్టీలు నన్ను తమ అభ్యర్థిగా ఉండమని కోరాయి. ప్రజలూ ఆకాంక్షించారు. అయితే ప్రస్తుత పరిస్థితులు పూర్తిగా పరిశీలించిన తరువాత ఎన్నికల్లో పోటీ చేయకూడదని నిర్ణయించుకున్నా’ అన్నది మరో ప్రసంగం. 2012 రాష్ట్రపతి ఎన్నికల్లో నాటి యూపీఏ ప్రభుత్వం ప్రణబ్ ముఖర్జీ పేరును ప్రతిపాదించింది. మమత, ములాయం.. కలాం పేరు తెరపైకి తెచ్చారు. బీజేపీ మద్దతిచ్చింది. అయితే తగిన సంఖ్యాబలం లేదన్నది వారికీ తెలుసునని, ఈ నేపథ్యంలోనే కలాం పోటీ నుంచి తప్పుకున్నారని సింగ్ తెలిపారు.