మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకు ఆప్ దూరం


సాక్షి, ముంబై: మహారాష్ట్రలో మరో రెండు, మూడు నెలల్లో జరగబోయే అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయకూడదని ‘ఆమ్ ఆద్మీ పార్టీ’ (ఆప్) నిర్ణయం తీసుకుంది. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో లభించిన విజయంతో ఆప్ అధ్యక్షుడు అరవింద్ కేజ్రీవాల్‌తోపాటు ఆప్ పదాధికారులు దేశవ్యాప్తంగా లోకసభ ఎన్నికల్లో పోటీ చేయాలని నిర్ణయం తీసుకున్నారు. అదే విధంగా వివిధ రాష్ట్రాల్లో ముఖ్యంగా మహారాష్ట్రలో కూడా అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయనున్నట్టు ప్రకటించారు. కాని లోక్‌సభ ఎన్నికల్లో ఆ పార్టీ ఘోరపరాజయం చవిచూసింది.

 

మహారాష్ట్రలో కేవలం 2.2 శాతం ఓట్లు ఆప్‌కు లభించాయి. దీంతోపాటు గతంలో మాదిరిగా ప్రస్తుతం రాష్ట్రంలో ఆప్ అంతగా క్రియశీలంగా పనిచేయడంలేదు. వీటన్నింటినీ దృష్టిలో పెట్టుకుని మహారాష్ట్రలో పోటీ చేయకూడదని ఆప్ నిర్ణయం తీసుకున్నట్టు తెలిసింది. ఎన్నికల్లో పోటీ చేయడానికి బదులు పార్టీని గ్రామగ్రామానికి విస్తరించి బలోపితం చేయాలని సంకల్పించింది. ఇదిలా ఉండగా, దీనికి ముందు ఆప్ హర్యానా టీమ్ కూడా అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయవద్దని నిర్ణయం తీసుకుంది. దీంతో హర్యానా బాటలోనే మహారాష్ట్ర యూనిట్ కూడా నిర్ణయం తీసుకుంది.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top