యూపీ ఎన్నికలకు.. ఆ గ్రామం దూరం
లక్నో: ఉతర్ ప్రదేశ్లో బుందేల్ ఖండ్ రీజియన్లోని బందా జిల్లాలో 4500 మంది నివసిస్తున్న గ్రామం చాందౌర్. ఉత్తర్ ప్రదేశ్ ఎన్నికల సమరం సమీపిస్తున్న సమయంలో చాందౌర్ గ్రామస్తులందరూ సమావేశమయ్యారు. ఎన్నో ఏళ్లుగా ఎన్నికలు వస్తూ, పోతునే ఉన్నాయి కానీ, సమస్యలు మాత్రం అలానే ఉంటున్నాయని గ్రామస్తులంతా కలిసి ఓ కఠిన నిర్ణయం తీసుకున్నారు. గ్రామస్తులందరూ కలిసి బీజేపీ, కాంగ్రెస్, సమాజ్వాదీ పార్టీ, బీఎస్పీలతో పాటూ అన్ని మిగిలిన రాజకీయ పార్టీలను కడిగిపారేశారు. ఏ పార్టీ కూడా తమ గ్రామానికి ఏమీ చేయలేదంటూ నిప్పులు చేరిగారు. ఎన్నో ఏళ్లుగా తమ గ్రామస్తులు ఓటు వేస్తున్నా ఎలాంటి ప్రయోజనం లేకపోవడంతో అందరూ కలిసి మూకుమ్మడిగా ఓటు వేయకూడదని ప్రతిజ్ఞ పూనారు. ఓటు వేసి ప్రయోజనమే లేనప్పుడు ఎందుకు మా హక్కుగా ఓటును వినియోగించుకోవడం అంటూ గ్రామస్తులందరూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రస్తుతం ఇక్కడ సిట్టింగ్ ఎమ్మెల్యేగా బీఎస్పీకి చెందిన వ్యక్తి ఉన్నాడు.
ఊర్లో కనీస విద్య కోసం ఎన్నో ఎళ్లుగా తాపత్రయపడుతున్నామని కూలి పని చేసుకుంటూ పొట్టపోసుకుంటున్న ఆనంద్ కుమార్ అనే యువకుడు ఆవేదన వ్యక్తం చేశాడు. 'ఒక వేళ వేరే చోటకి వెళ్లి విద్యనభ్యసించినా ఉద్యోగాలు కరువు. ఉన్నత విద్యలో పట్టాలు పుచ్చుకున్నా ప్రయోజనం లేకుండా పోయింది. ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామన్న రాజకీయ నాయకుల మాటలు వినీ వినీ వారి అబద్ధపు మాటలు ఇంకా వినే ఓపిక మాకులేదు' అంటూ ఆర్ట్స్లో మాస్టర్స్ చేసి కూడా ఇంకా నిరుద్యోగిగానే ఉన్న శివ్ బోధన్ ఉద్విగ్నంగా ప్రసంగించాడు.
'ఎన్నో కేసులు ఈ ఊర్లో పెండింగ్లోనే ఉన్నాయి. మాది ఓ మారుమూలు గ్రామం. మా గ్రామస్తుల కేసుల పరిష్కారం కోసం జడ్జీలు, న్యాయవాదులు ఆసక్తి చూపించడం లేదు. రేషన్ కార్డులు కూడా లేవు. ధృవపత్రాలు కూడా ఎవరికి సరిగ్గా లేవు. భూమి పత్రాల విషయాల్లోనూ ప్రభుత్వం తరఫునుంచి ఎలాంటి సహాయం లేదు. మా ప్రాథమిక హక్కుల కోసం ఎన్నో ఎళ్లుగా కొట్లాడుతున్నాము. ప్రతి ఎన్నికల ముందు రాజకీయ పార్టీలు ఇస్తున్న హామీలను చూస్తూనే ఉన్నాము. వాళ్లు ఏమీ చేయలేరని తెలిసినా ఓటు వేసి ప్రయోజనం లేదని గ్రామస్తులమంతా కలిసి తేల్చాము. ఇంకా ఈ ఎన్నికల్లో ఓటు వేయకూడదని దృఢంగా నిశ్చయించుకున్నాము' అని వ్యవసాయం చేసుకుంటూ జీవించే మల్కన్ లాల్ తెలిపారు.
ఎన్నో ఏళ్లుగా కరువుతో అలమటిస్తున్న చాందౌర్ గ్రామం దుర్భిక్షంలో కూరుకుపోయి నిస్సహాయ స్థితిలో ఉందని 70 ఏళ్ల గుజరాఠియా తెలిపింది. తాను బతికున్నానో, చచ్చానో కూడా గుర్తించని రాజకీయ నాయకులకు ఓటెందుకు వేయాలని ఆమె ధ్వజమెత్తింది. 'నాకు ఇద్దరు పిల్లలున్నారు. వాళ్ల వివాహం కోసం ఎన్నో రోజులుగా కళ్లు కాయలయ్యేలా ఎదురు చూస్తున్నా. కడుపు కాలే వాడికి పిల్లను ఎవరు ఇస్తారు. ప్రజాస్వామ్యం ఉన్నది కేవలం డబ్బు ఉన్న వాళ్లకి మాత్రమే' అంటూ గుజరాఠియా గ్రామస్తుల ఎదుట తన ఆవేదన వ్యక్తం చేసింది.
చాందౌర్ గ్రామంలో ఎన్నికలను మూకుమ్మడిగా బాయ్కాట్ చేయడం ఓ చారిత్రక అవసరంగా గ్రామ ప్రధాన్ రామచందర్ పేర్కోన్నారు. ఎంతో కఠిన నిర్ణయం అయినా ప్రజా ప్రతినిధులు, జర్నలిస్టుల దృష్టిని తమ గ్రామం వైపు తిప్పే అవకాశం ఉందని తెలిపారు.
గ్రామస్తులు తీసుకున్న ఎలక్షన్ బాయ్ కాట్ నిర్ణయం ఇప్పుడు జాతీయ స్థాయిలో చర్చనీయాంశమైంది. ఇప్పటికైనా చర్చలతో కాకుండా ఆ గ్రామస్తుల సమస్యలను తీరుస్తారో లేక మరోసారి హామీల వర్షాలు గుప్పిస్తారో వేచి చూడాల్సిందే.