టాయ్లెట్లో 3కిలోల బంగారు బిస్కెట్లు
చెన్నై : తిరుచినాపల్లి అంతర్జాతీయ విమానాశ్రయం మరుగుదొడ్డిలో మూడు కిలోల బంగారు బిస్కెట్లు పోలీసులకు లభించాయి. విదేశాల నుంచి విమానంలో వచ్చిన ప్రయాణికులందరినీ అధికారులు క్షుణ్ణంగా తనిఖీలు చేశారు. ఈ క్రమంలో మంగళవారం రాత్రి 11.30 గంటల సమయంలో విమానాశ్రయం లోపల ఉన్న మరుగుదొడ్డిలో గుర్తు తెలియని పార్సిల్ ఉన్నట్లు పారిశుద్ధ్య సిబ్బంది అధికారులకు తెలిపారు. వెంటనే అధికారులు అక్కడికి వెళ్లి చూడగా అక్కడు మూడు పార్సిల్స్ పడి ఉన్నాయి. అధికారులు ఆ పార్సిళ్లను విప్పి చూడగా, అందులో బంగారు బిస్కెట్లు కనిపించాయి.
ఒక్కొక్క బాక్స్లో ఒక్కొక్క కిలో బరువు గల బంగారు బిస్కెట్లు ఉన్నట్లు, మూడు బాక్స్లలో మూడు కిలోల బంగారు బిస్కెట్లు ఉన్నట్లు తెలిసింది. వాటి విలువ రూ.75 లక్షలు ఉంటాయని అధికారులు తెలిపారు. రాత్రి 11.30 గంటల సమయంలో మలేషియా నుంచి విమానంలో తిరుచ్చికి వచ్చిన ప్రయాణికుల్లో ఎవరైనా పోలీసుల తనిఖీలకు భయపడి తాము తెచ్చిన బంగారు బిస్కెట్లను టాయ్లెట్లో పడ వేసి ఉంటారని పోలీసులు భావిస్తున్నారు. దీంతో ఆ విమానంలో వచ్చిన వారి పేర్లు, వివరాలను పోలీసులు పరిశీలిస్తున్నారు.
**