ఈశాన్య రాష్ట్రాల్లో భారీవర్షాలు.. 20 మంది మృతి
చందేల్ : మణిపూర్, ఒడిశా, పశ్చిమబెంగాల్ సహా ఈశాన్య రాష్ట్రాలను భారీ వర్షాలు ముంచెత్తాయి. ఈ ఘటనలో ఇరవై మంది మృతిచెందినట్లు అధికారులు తెలిపారు. మణిపూర్ లోని తౌబాన్ జిల్లాలో వరద ఉధృతికి జాతీయరహదారులు, వంతెనలు ధ్వంసమయ్యాయి. చందేల్ జిల్లాలో భారీగా నష్టం వాటిల్లినట్లుగా తెలుస్తోంది. గత మూడు రోజులుగా ఈ రాష్ట్రాల్లో విపత్కర పరిస్థితులు నెలకొన్న విషయం తెలిసిందే.
కొండచరియలు విరిగిపడటం, వరదలు చాలా ఎక్కువగా ఉండటంతో రక్షణ బృందాలు అక్కడికి చేరుకోవడానికి చాలా ఇబ్బందులు తలెత్తుతున్నాయి. ఇంఫాల్ లో దిగువ ప్రాంతాల్లో ఉండే వారు ఇళ్లు కోల్పోయి శివారు ప్రాంతాల్లో నిరాశ్రయులుగా ఉన్నారు.
పశ్చిమబెంగాల్లో వరద భీభత్సంతో తాజాగా 12 జిల్లాల్లో 1.19 లక్షల మంది నిరాశ్రయులయ్యారని సీఎం మమతా బెనర్జీ అన్నారు. ఒడిశాలో భారీ వర్షాల కారణంగా ఐదు జిల్లాల్లోని 4.79 లక్షల మంది తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని అధికారులు వెల్లడించారు.