ఆ హత్య చేసిన మనిషి... ప్లాన్‌ ఏమిటో నాకు చెప్పాడు!

ఆ హత్య చేసిన మనిషి... ప్లాన్‌ ఏమిటో నాకు చెప్పాడు! - Sakshi


‘‘వంగవీటి రాధా హత్యతో మొదలైన విజయవాడ రౌడీ రాజకీయ చరిత్ర వంగవీటి మోహనరంగా హత్యతో ఎలా ముగిసిందనేది ‘వంగవీటి’ చిత్రకథ’’ అన్నారు రామ్‌గోపాల్‌ వర్మ. ఆయన దర్శకత్వంలో దాసరి కిరణ్‌కుమార్‌ నిర్మించిన ‘వంగవీటి’ నేడు రిలీజవుతోంది. విలేకరులకు వర్మ చెప్పిన విశేషాలు...



వంగవీటి కుటుంబంలో రాధా, రంగా, దేవినేని కుటుంబంలో గాంధీ, మురళి... చనిపోయారు. వాళ్లను ఎలా చంపారు? చంపడానికి ప్రేరేపించిన ఘటనలు ఏంటి? అనేవి చిత్రంలో చూపించాను. ఓ గ్రూప్‌గా ఉన్న వీళ్లంతా వేరుపడిన సందర్భాలు చూసి బాధ కలుగుతుంది. ఈ చిత్రంలో ఎన్టీఆర్‌ పాత్ర ఏంటనేది ప్రస్తుతానికి సస్పెన్స్‌.



బెజవాడలోని బలమైన రెండు సామాజిక వర్గాల్లో ఏ ఒక్క వర్గానికీ మద్దతు ఇవ్వకుండా తటస్థంగా తీసిన చిత్రమిది. అందువల్ల, ఎవరి మనోభావాలూ దెబ్బ తినే అవకాశం లేదనుకుంటున్నా! నేను ఏ వర్గానికీ చెందిన వ్యక్తిని కాదు. ‘వంగవీటి రాధా అనే రౌడీని చంపే శారు’ అని మా చినమావయ్య చెప్పారు. అప్పుడు రాధా, రౌడీ పదాల్ని తొలిసారి విన్నా. అందుకే, ‘వంగవీటి’ అని టైటిల్‌ పెట్టా.



ఇందులో చూపించినవన్నీ నిజాలేనా? అని అడిగితే... నా సమాధానం ఒకటే... నేను నమ్మిన నిజాలను చూపించా. ఉదాహరణకు చలసాని వెంకటరత్నం 72 కత్తిపోట్లతో మరణించాడన్నారు. ‘72 కత్తిపోట్లు పొడిచేవరకూ మనిషి బతుకుతాడా?’ అని నేను నమ్మలేదు. వెంకట రత్నాన్ని చంపిన 12 మందిలో ఒకతను అప్పట్లో చంపడానికి వేసిన ప్లాన్‌ ఏమిటో నాతో చెప్పాడు. అప్పుడు నమ్మకం కలిగింది. అతడితో మాట్లాడిన తర్వాత సినిమా ఎలా తీయాలనే స్పష్టత వచ్చింది.



ఫస్ట్‌ కాపీ చూసినప్పుడు సిన్మా చాలా వయొలెంట్‌గా తీశాననిపిం చింది. ఒక్క దేవినేని మురళిని చంపే సీనే పావుగంట ఉంటుంది.



దాసరి కిరణ్‌కుమార్‌ ‘డబ్బులు ఖర్చుపెడితే చాలు’ అనుకునే నిర్మాత కాదు. ఈ సినిమా కోసం నాకంటే అతను పడిన కష్టమే ఎక్కువ. షూటింగ్‌ కోసం మూడు రోజుల్లో 75 అంబాసిడర్‌ కార్లు ఏర్పాటు చేశారు. ఇప్పుడు అంబాసిడర్‌ కార్లు ఎక్కడా లేవు. ఎలా ఏర్పాటు చేశాడని ఆశ్చర్యపోయా.



పూరి జగన్నాథ్‌ ఆఫీసులో ఓ పార్టీకి వెళ్లినప్పుడు సందీప్‌ (శాండీ)ని చూశా. రాధా ఫొటో చూపించి ఈ గెటప్‌లో నీ ఫొటోలు పంపమని అడిగా. రెండో రోజు సాయంత్రానికి ఫొటోలు పంపించాడు. పర్‌ఫెక్ట్‌గా సెట్‌ అయ్యాడు. వారం తర్వాత రంగా పాత్రలో కూడా సందీప్‌ నటిస్తే ఎలా ఉంటుందనుకున్నా. మళ్లీ రంగా గెటప్‌లో ఫొటోలు పంపమన్నా. రంగా పాత్రకీ సెట్‌ అయ్యాడు. నాకు దేవుడు ఇచ్చిన బహుమతి సందీప్‌. సినిమాలో చాలా బాగా నటించాడు. ఓ ఇమేజ్‌ ఉన్న నటుడయితే... మరణించే సన్నివేశాలతో ప్రేక్షకుడు కనెక్ట్‌ కాలేడు. కొత్త వాళ్లయితే ఇమేజ్‌ కాకుండా కేవలం క్యారెక్టర్లు మాత్రమే ఎస్టాబ్లిష్‌ అవుతాయి. అందువల్ల, సినిమాలో ప్రధాన పాత్రలన్నిటికీ కొత్తవాళ్లను తీసుకున్నా.



‘గాడ్‌ ఫాదర్‌’లో అమెరికన్‌ మాఫియా గురించి చూపించారు. ఎంత మందికి అక్కడి మాఫియా గురించి తెలుసని సినిమా చూశారు. అలాగే ‘షోలే’ చూశారు. ‘వంగవీటి’ విజయవాడ కథైనా ప్రేక్షకులం దరూ చూస్తారు. విజయవాడ ప్రేక్షకులు సినిమాలో ఏముందో తెలుసుకోవాలని చూస్తే, మిగతావాళ్లు ఫిక్షనల్‌ సినిమాగా చూస్తారు.



ఆయనతో సినిమా తీసే కెపాసిటీ నాకు లేదు!

నేను పవన్‌కల్యాణ్‌ వీరాభిమానిని. పవన్‌కీ, పవనిజమ్‌కీ తేడా ఉంది. పవనిజమ్‌ అనేదానికి అసలు అర్థమే లేదు. రామూయిజమ్‌ మీద నేను 45 గంటలు మాట్లాడాను. నాకు తెలిసి పవనిజమ్‌ మీద పవన్‌కల్యాణ్‌ ఓ ఐదు నిమిషాలు కూడా మాట్లాడలేదు. వ్యక్తిగా అతను ఏ అంశం మీద అయినా మాట్లాడగలడు. ఇజమ్‌కి, వ్యక్తికి తేడా ఏంటంటే... కార్ల్‌మార్క్స్‌ అనేవాడు కమ్యునిజమ్‌పై పుస్తకం రాశాడు. కానీ, తానేం చేయలేదు. ఎక్కడో ఉన్న మావో, లెనిన్‌ అందులో అంశాలను తీసుకుని సమాజానికి చాలా చేశారు. అప్పుడప్పుడు పవన్‌కల్యాణ్‌ చేస్తున్నవి చూస్తున్నాను. నా ఉద్దేశంలో పవన్‌కల్యాణ్‌ ఓ నిద్రపోతున్న అగ్ని పర్వతం. ఆ నిద్రలో కూడా మధ్య మధ్యలో అందర్నీ గమనిస్తూ ఉంటాడు. టైమ్‌ వచ్చినప్పుడు అగ్ని పర్వతం పేలుతుంది.



చిరంజీవిగారితో, ఆయన ఇమేజ్‌తో సినిమా తీసే కెపాసిటీ నాకు లేదు. కానీ, ఓ అభిమానిగా ‘బాహుబలి’ కంటే భారీ సినిమాలో ఆయన్ను చూడాలని కోరుకుంటున్నా. నేను ఎక్కువగా రియలిస్టిక్‌ సినిమాలు తీస్తా. ఆ యా సినిమాలకు తెలుగులో స్టార్‌ హీరోల ఇమేజ్‌ అవరోధం అవుతుందేమో!



‘నాగార్జునతో ‘క్షణక్షణం–2’, నాతో ‘శివ–2’ తీయ్‌’ అని వెంకటేశ్‌ అన్నారు. నేను దర్శకత్వం వహిస్తే ‘శివ–2’ చేస్తానన్నారు నాగార్జున. కానీ, ‘శివ’ సీక్వెల్‌ సాధ్యం కాదు. అప్పటి పరిస్థితులు, విద్యార్థి రాజకీయాలు ఇప్పుడు లేవు. నాగార్జునతో మంచి యాక్షన్‌ ఫిల్మ్‌ తీస్తా. చైతన్య, అఖిల్‌లతో సినిమాలు తీసే ఉద్దేశం లేదు.



జయలలిత స్నేహితురాలు ‘శశికళ’పై తీయనున్న సినిమా వచ్చే తమిళనాడు ఎన్నికల సమయంలో విడుదల చేయాలనేది ప్లాన్‌. జయలలితతో పోలిస్తే, ఎటువంటి బ్యాక్‌గ్రౌండ్‌ లేకుండా ఓ పార్టీని, రాష్ట్రాన్ని శాసించే స్థాయికి వచ్చిన ‘శశికళ’ బయోగ్రఫీ నాకు ఆసక్తి కలిగించింది.



అమితాబ్‌ బచ్చన్‌ ‘సర్కార్‌–3’ షూటింగ్‌ పూర్తయింది. మార్చిలో రిలీజ్‌ చేస్తాం. వచ్చే ఏడాది హాలీవుడ్‌ సినిమా ‘న్యూక్లియర్‌’ షూటింగ్‌ ప్రారంభిస్తా. సుమారు ఓ రెండు, మూడేళ్లు ‘న్యూక్లియర్‌’తోనే సరిపోతుంది.

Read latest News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top