ప్రధాని మోదీకి హీరోయిన్ విన్నపం
ముంబై: బాలీవుడ్ దర్శకుడు సంజయ్ లీలా భన్సాలీ దర్శకత్వం వహిస్తున్న పద్మావతి సినిమా షూటింగ్ సెట్ పై దాడి చేయడాన్ని నటి సోనమ్ కపూర్ ఖండించింది. సినీ పరిశ్రమకు అండగా నిలవాలని ప్రధాని నరేంద్ర మోదీని కోరింది. రిపబ్లిక్ డేకు రెండు రోజుల తర్వాత సినీ పరిశ్రమకు అవమాన సంఘటనలు ఎదురయ్యాయని, తమకు చాలా బాధ కలిగించందని, తమకు అండగా నిలవాలని కోరుతూ సోనమ్.. ప్రధాని మోదీకి ట్వీట్ చేసింది.
రాజస్థాన్ రాజధాని జైపూర్లో పద్మావతి షూటింగ్ సెట్పై రాజ్ పుట్ కర్ని సేన సభ్యులు దాడి చేసి, భన్సాలీపై దాడి చేసిన సంగతి తెలిసిందే. ఈ సినిమాలో రాణి పద్మినిని అగౌరవపరిచేలా సన్నివేశాలను చిత్రీకరించారని ఆరోపిస్తూ, వీటిని తొలగించాలని డిమాండ్ చేశారు. ఈ దాడిని ఖండిస్తూ బాలీవుడ్ పరిశ్రమ భన్సాలీకి అండగా నిలిచింది. సోనమ్ కపూర్ ఈ విషయాన్ని ప్రధాని మోదీకి దృష్టికి తీసుకెళ్లి తమకు అండగా నిలవాలని కోరారు.