గాయనిగా సిమ్రాన్
ఒకప్పుడు హీరోయిన్గా విరాజిల్లి దక్షిణాదిలో నటిగా తానేమిటో నిరూపించుకున్నారు సిమ్రాన్. హీరోయిన్గా మంచి హైప్లో ఉండగానే పెళ్లి చేసుకుని తల్లి అయిన సిమ్రాన్ ఇటీవల మళ్లీ నటించడానికి సిద్ధం అయ్యారు. అయితే వచ్చిన అవకాశాలన్నీ అంగీకరించకుండా నచ్చిన పాత్రల్నే చేస్తున్నారు. ఈ బహుభాషా నటి తాజాగా గాయని అవతారం ఎత్తనున్నారు. నటుడు పార్థీపన్ తాను దర్శకత్వం వహిస్తున్న కథై, తిరై కథై, వచనం, ఇయక్కం చిత్రంలో సిమ్రాన్తో పాడించడానికి సిద్ధం అవుతున్నారు. దీని గురించి పార్థీపన్ మాట్లాడుతూ సిమ్రాన్లో మంచి గాయని ఉన్నారన్న విషయాన్ని తాను 1996లో ఆమెతో టాటా బిర్లా చిత్రంలో నటిస్తున్నప్పుడే గమనించానన్నారు.
అప్పట్లో ఆమె హీరోయిన్గా బిజీగా ఉండడంతో పాటపై దృష్టి సారించకపోయినా అలాంటి ఆసక్తిని కనబరుస్తూ వచ్చారన్నారు. అలాంటిది తానే సిమ్రాన్కు గాయని అవకాశం కల్పించడం సంతోషంగా ఉందన్నారు. ప్రస్తుతం విదేశాల్లో వున్న సిమ్రాన్ మే 9న చెన్నైకి తిరిగి రానున్నారని అప్పుడు ఆమె తన చిత్రం కోసం పాడనున్నారని చెప్పారు. కథై, తిరై కథై, వచనం, ఇయక్కం చిత్రం షూటింగ్ 90 శాతం పూర్తి అయ్యిందని తెలిపారు. నటుడు విశాల్, ప్రకాష్రాజ్ నటించనున్న సన్నివేశాలతో చిత్ర షూటింగ్ పూర్తి అవుతుందని అన్నారు. ఇప్పటికే ఈ చిత్రంలో ఆర్య, విజయ్ సేతుపతి, అమలాపాల్, తాప్సీ తదితరులు అతిథి పాత్రల్లో నటించడం గమనార్హం. తాజాగా సిమ్రాన్ పాడటం, విశాల్, ప్రకాష్రాజ్లు గెస్ట్ రోల్స్ పోషించనుండడంతో ఈ చిత్రంపై అంచనాలు పెరుగుతున్నాయి.