నాన్న సినిమా చూడను..!

నాన్న సినిమా చూడను..! - Sakshi


ఒకే కుటుంబానికి చెందిన ఇద్దరు నటీనటులు నటించిన చిత్రాలు ఒకేరోజు విడుదలైతే? ఆ ఇద్దరిలో ఎవరి సినిమా ఆడుతుంది? అనే చర్చ జరగడం ఖాయం. ప్రస్తుతం కమల్‌హాసన్, శ్రుతీహాసన్ నటించిన చిత్రాల గురించి అలాంటి చర్చే జరుగుతోంది. కమల్ నటించిన ‘ఉత్తమ విలన్’, శ్రుతి నటించిన హిందీ చిత్రం ‘గబ్బర్ ఈజ్ బ్యాక్’ - రెండూ మే 1న విడుదల కానున్నాయి. నటుడిగా కమల్ వయసు యాభైఏళ్లకు పైనే కాబట్టి, ఆయన నటనతో శ్రుతి నటనకు పోలిక పెట్టడం సరికాదు.



కానీ, రెండు సినిమాలూ విజయం సాధించాలని ఇద్దరూ కోరుకోవడం సహజం. అయితే, ఈ ఇద్దరూ ముందు ఏ సినిమా చూస్తారు? ఇదే విషయాన్ని ఓ ఆంగ్ల పత్రిక శ్రుతీహాసన్‌ను అడిగితే... ‘‘ముందు మా నాన్న సినిమా చూడను. నేను నటించిన సినిమానే చూస్తా’’ అని ముక్కుసూటిగా చెప్పారు. మరి.. మీ నాన్నగారు ఏ సినిమా చూస్తారని ఊహిస్తున్నారు? అన్న ప్రశ్నకు -‘‘ఆయన కూడా ముందు నా సినిమా చూడరు.



ఆయన నటించిన సినిమాయే చూస్తారు. ఆ విషయంలో మాకో స్పష్టత ఉంది. వృత్తిపరంగా ఒకరికొకరం మద్దతుగా నిలిచినా, ఎవరి సినిమా వాళ్లకు గొప్ప’’ అన్నారు. ఎంతైనా ప్రొఫెషనల్స్!

Read latest News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top