ఆమెతో మళ్లీ నటించను!

ఆమెతో మళ్లీ నటించను!


 ‘‘సినిమా రంగంలోకి అడుగుపెట్టిన ఈ ఆరేళ్లల్లో నేనిలాంటి చేదు అనుభవాన్ని ఎప్పుడూ ఎదుర్కొలేదు. ఆ ఘనత మన్నారాకే దక్కింది. నా పట్ల తను చాలా దారుణంగా ప్రవర్తించింది’’ అని శ్రద్ధాదాస్ వాపోతున్నారు. వివేక్ అగ్నిహోత్రీ దర్శకత్వంలో రూపొందిన హిందీ చిత్రం ‘జిద్’లో శ్రద్ధ ఓ కథానాయికగా నటించారు. మరో నాయికగా ప్రియాంక చోప్రా కజిన్ మన్నారా నటించారు. ఈమె బార్బీ హండా పేరుతో ‘ప్రేమా గీతా జాన్‌తా నయ్’ ద్వారా తెలుగు తెరకు పరిచయమయ్యారు. హిందీలో ఆమెకిది తొలి చిత్రం. కాగా, ఈ చిత్రం షూటింగ్ సమయంలో శ్రద్ధాదాస్‌ని కొట్టే సన్నివేశాల్లో మన్నారా నటించకుండా జీవించేశారట.

 

  ఈ విషయం గురించి శ్రద్ధాదాస్ మాట్లాడుతూ - ‘‘మామూలుగా సినిమాల్లో చెంప చెళ్లుమనిపించే సన్నివేశాల్లోనూ, ఫైట్ సీన్స్‌లోనూ నటిస్తారే కానీ.. ఎవరూ నిజంగా కొట్టరు. కానీ, మన్నారా నన్ను నిజంగానే కొట్టింది. మొదటిసారి పొరపాటున జరిగిందని సరిపెట్టుకున్నా. ఆ తర్వాత మరోసారి నన్ను తను కర్రతో కొట్టే సీన్ తీసినప్పుడు, నకిలీ కర్రతో కాకుండా నిజమైన కర్రతో కొట్టింది. నాకు గాయాలయ్యాయి. సినిమాలో నేనూ, తనూ గొడవపడే సన్నివేశాల్లో తన చేతివాటం చూపించింది మన్నారా. తనెందుకలా చేసిందో అర్థం కావడంలేదు. నేను చాలా బాధపడ్డాను. ఇక మన్నారా కాంబినేషన్లో సినిమాలు చేయను’’ అని గోడును వెళ్లబోసుకున్నారు. ఈ నెల 28న ఈ ‘జిద్’ చిత్రం విడుదల కానుంది.

 

Read latest News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top