ఆ రెండు చిత్రాలతోనే..
తమిళసినిమా: చిత్రపరిశ్రమను అనుభవజ్ఞులు విచిత్ర పరిశ్రమ అంటారు. అది అక్షర సత్యం. ఇక్కడ రాణించడానికి చాలా మంది పోరాడతారు. అయితే చాలా కొద్ది మందే సక్సెస్ అవుతుంటారు. అందుకు కారణం ప్రతిభ కావచ్చు, అదృష్టం కావచ్చు. తాజాగా అలాంటి లక్కీగళ్ ఎవరైనా ఉన్నారంటే అది నటి సాయిపల్లవినే. ఇప్పటి వరకూ నటించింది మూడు చిత్రాలే. అందులో రెండు చిత్రాలు అద్బుత విజయాన్ని నమోదు చేసుకున్నాయి. ఈ అమ్మాయిని చాలా మంది కేరళకుట్టి అనుకుంటారు. కారణం తను నటిగా పరిచయమైంది మలయాళ చిత్రంతో. నిజానికి సాయిపల్లవి అచ్చ తమిళ అమ్మాయి. తమిళనాడులోని కోటగిరి గ్రామంలో పుట్టి పెరిగింది. కోయంబత్తూర్లో ఉన్నత విద్యను అభ్యసిందింది.
మెడికల్ స్టూడెంట్ అయిన సాయిపల్లవి మంచి డాన్సర్. ఆ కళే తనను చిత్ర రంగానికి పరిచయం చేసింది. ఉంగళిల్ యార్ అడుత్త ప్రభుదేవా డాన్స్ కాంపిటీషన్లో పాల్గొన్న ఈ అమ్మడిపై మలయాళ దర్శకుడు అల్ఫోన్సన్ దృష్టి పడింది.అంతే 2015లో ఆయన దర్శకత్వం వహించిన మలయాళ చిత్రం ప్రేమమ్ చిత్రంలో ముగ్గురు కథానాయికల్లో ప్రధాన పాత్ర మలర్ టీచర్గా నటించింది. ఆ చిత్ర విజయం మాలీవుడ్లోనే కాకుండా కోలీవుడ్, టాలీవుడ్ల్లోనూ పిచ్చ క్రేజ్ను తీసుకొచ్చింది. ముఖ్యంగా కోలీవుడ్లో పలు అవకాశాలు సాయిపల్లవి ఇంటి తలుపు తట్టాయి. అందులో ప్రఖ్యాత దర్శకుడు మణిరత్నం ఆఫర్ కూడా ఉంది.
అయితే సాయిపల్లవి తొందర పడి వచ్చిన అవకాశాలను అంగీకరించలేదు. చాలా సెలెక్టెడ్ చిత్రాలనే సమ్మతించింది. ప్రేమమ్ చిత్రం తరువాత మాలీవుడ్లో కలి అనే చిత్రం చేసింది. అంతే ఆ తరువాత టాలీవుడ్లో ఫిదా చిత్రంలో నటించింది. ఆ చిత్రం ఇప్పుడు అక్కడ కలెక్షన్ల వర్షం కురిపిస్తూ టాక్ ఆఫ్ది సౌత్ ఫిలిం ఇండస్ట్రీగా మారింది. రెండే రెండేళ్లు, మలయాళంలో ప్రేమమ్, తెలుగులో ఫిదా చిత్రాలు సాయిపల్లవిని క్రేజీ నాయకిని చేసేశాయి. ఇంకా కోలీవుడ్లో నటించిన చిత్రం తెరపైకి కూడా రాలేదు. అప్పుడే అమ్మడి పారితోషికం కోటిని టచ్ చేయడానికి రెడీగా ఉందట.
మలయాళ చిత్రంలో దర్శకుడు అల్ఫోన్సన్ ఎంత పారితోషికం ఇప్పిచ్చారో గానీ, తెలుగు చిత్రం‘ ఫిదా’కు మాత్రం, రూ. 10 లక్షలు పుచ్చుకుందట. ఆ చిత్రం తరువాత వెంటనే రూ.70 లక్షలకు పెంచేసిందని సమాచారం. విశేషం ఏమటంటే సాయిపల్లవికి ఇంత భారీ పారితోషికం ముట్టచెప్పవచ్చనే అభిప్రాయమే చిత్ర వర్గాల్లో వ్యక్తం అవుతోంది. ప్రస్తుతం తమిళంలో విజయ్ దర్శకత్వంలో కరు అనే చిత్రంలోనూ, తెలుగులో నానికి జంటగా ఎంసీఏ అనే చిత్రంలోనూ నటిస్తోంది. మరిన్ని అవకాశాలు సాయిపల్లవి కోసం ఎదురు చూస్తున్నాయి. మరో విషయం ఏమిటంటే సాయిపల్లవి తొలుత కోలీవుడ్లోనే నటిగా పరిచయమైంది. జయంరవి, కంగనా రనౌత్ జంటగా నటించిన ధామ్ ధూమ్ చిత్రంలో ఒక చిన్న పాత్రను పోషించింది. అయితే అప్పట్లో ఈ అమ్మడిని ఎవరూ పట్టించుకోలేదు.
సంబంధిత వార్తలు