అతనికి తిక్క రేగిందంటే...!

అతనికి తిక్క రేగిందంటే...!


‘‘నాక్కొంచెం తిక్కుంది...కానీ దానికో లె క్కుంది’’అని ‘గబ్బర్‌సింగ్’ సినిమాలో పవన్‌కల్యాణ్ అంటే... ఇప్పుడు ఆయన మేనల్లుడు  సాయిధరమ్‌తేజ్ తనకు తిక్క రేగితే ఎలా ఉంటుందో ప్రేక్షకులకు చూపిస్తానంటున్నారు.  శ్రీ వెంకటేశ్వర మూవీ మేకర్స్ పతాకంపై సునీల్ రెడ్డి దర్శక త్వంలో సి.రోహిణ్ కుమార్ రెడ్డి నిర్మిస్తున్న చిత్రం ‘తిక్క’. సాయిధరమ్ తేజ్,  లారిస్సా బోనేసి జంటగా నటిస్తున్న ఈ చిత్ర ప్రారంభోత్సవం శుక్రవారం  హైదరాబాద్‌లో జరిగింది.

 

 తెలంగాణ రాష్ట్ర రవాణా శాఖ మంత్రి మహేందర్‌రెడ్డి కెమెరా స్విచాన్ చేయగా, నిర్మాత అల్లు అరవింద్ క్లాప్ కొట్టారు. నిర్మాత ‘దిల్’ రాజు గౌరవ దర్శకత్వం వహించారు. ఈ వేడుకలో - రాజకీయ ప్రముఖులు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, ఎర్రబెల్లి దయాకర్‌రావు, ఎల్.రమణ, సినీ ప్రముఖులు నాగబాబు, కొరటాల శివ తదితరులు పాల్గొన్నారు. సాయిధరమ్‌తేజ్ మాట్లాడుతూ- ‘‘ఇది నాకు నాలుగో సినిమా. ఏడాది క్రితం సునీల్‌రెడ్డిగారు ఈ కథ చెప్పారు. ఇందులో నా పేరు ఆదిత్య. హీరోయిన్ తో ఎంతో ఈజీగా ప్రేమలో పడతాను. కానీ అంతలోనే మా ఇద్దరికీ బ్రేకప్ అవుతుంది.  

 

 దాంతో నాకు తిక్క రేగి మళ్లీ ఆ అమ్మాయి ప్రేమను ఎలా గెల్చుకున్నానన్నదే ఈ సినిమా’’ అని తెలిపారు. సునీల్ రెడ్డి మాట్లాడుతూ- ‘‘ఎవరి లైఫ్‌కి వారే హీరో. కానీ ఈ సినిమాలో హీరో లైఫ్‌కి హీరోనే విలన్. అదే ఈ సినిమా మెయిన్ కాన్సెప్ట్. ఫుల్ హిలేరియస్‌గా ఉంటుంది’’ అని చెప్పారు. నిర్మాతగా తనకిది తొలి చిత్రమని, కథ విని ఎగ్టయిట్ అయ్యానని, ఈ నెల 10 నుంచి చిత్రీకరణ మొదలుపెడతామని రోహిణ్‌కుమార్ రెడ్డి తెలిపారు. ఈ చిత్రానికి  సంగీతం: ఎస్.ఎస్.థమన్, ఛాయాగ్రహణం: జ్ఞానశేఖర్, సహ నిర్మాత: ఆర్. కిరణ్.

Read latest News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top