నుజ్జు నుజ్జైన భరత్ కారు
హైదరాబాద్: అతివేగం మరొకరిని బలితీసుకుంది. ప్రముఖ సినీ కథానాయకుడు రవితేజ తమ్ముడు భరత్ కారు ప్రమాదంలో దుర్మరణం పాలయ్యారు. శంషాబాద్ నుంచి గచ్చిబౌలి వెళుతుండగా కొత్వాల్గూడ వద్ద ఆయన ప్రయాణిస్తున్న కారు ఆగివున్న లారీని ఢీకొంది. శనివారం రాత్రి 10 గంటల ప్రాంతంలో ఈ దుర్ఘటన చోటుచేసుకుందని శంషాబాద్ సీఐ మల్లేష్ తెలిపారు. రవితేజ సోదరుడని ఈ ఉదయం గుర్తించామన్నారు. ప్రమాద సమయంలో కారు 140 కిలోమీటర్ల వేగంతో వెళుతున్నట్టు గుర్తించామని చెప్పారు. కారులో అతడొక్కడే ఉన్నట్టు తెలిపారు. ప్రమాదంలో భరత్ ముఖం ఛిద్రం కావడంతో అతడిని గుర్తించడంలో ఆలస్యమైందన్నారు. ప్రమాద ఘటనపై దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు. కారులో మద్యం సీసాలు లభ్యమవడంతో భరత్ మద్యం సేవించినట్టు అనుమానిస్తున్నారు.
టీఎస్ 09 ఈసీ 0799 నంబరుతో ఉన్న ఈ ఎరుపురంగు స్కోడా కారు భరత్ తల్లి రాజ్యలక్ష్మి పేరిట కారు రిజిస్ట్రేషన్ అయింది. ప్రమాద తీవ్రతకు కారు ముందు భాగం నుజ్జయింది. ఎయిర్ బెలూన్ తెరుచుకున్నప్పటికీ అతి వేగానికి పగిలిపోయింది. స్టీరింగ్ విరిగిపోయింది. స్పీడోమీటర్ 140 కిలోమీటర్ల పైన ఆగిపోయింది. భరత్ మృతదేహానికి ఉస్మానియా ఆస్పత్రిలో పోస్టుమార్టం పూర్తి చేశారు. తర్వాత భౌతికకాయాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించారు. రవితేజ మరో సోదరుడు రఘు, నటుడు ఉత్తేజ్ మాత్రమే ఆస్పత్రికి వచ్చారు.
జూబ్లీహిల్స్ ప్రాంతంలో ఇటీవల జరిగిన రోడ్డు ప్రమాదంలో ఏపీ మంత్రి నారాయణ కుమారుడు నిషిత్ మృతి చెందిన సంగతి తెలిసిందే. మితిమీరిన వేగం కారణంగానే ఈ ప్రమాదం జరిగినట్టు పోలీసులు గుర్తించారు.