'ఓ శక్తి జయసుధను నడిపిస్తోంది'
హైదరాబాద్: మార్పు కోసమే మా అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేస్తున్నానని ప్రముఖ సినీ నటుడు రాజేంద్ర ప్రసాద్ అన్నారు. సేవ చేయడానికి మనసు, సంకల్పం ఉంటే చాలని చెప్పారు. ఇదో ధర్మయుద్ధమని రాజేంద్ర ప్రసాద్ అన్నారు. మా అధ్యక్ష పదవికి పోటీ చేస్తున్న ప్రముఖ సీనియర్ నటి జయసుధ వెనుక ఓ శక్తి ఉందని పేర్కొన్నారు. ఆ శక్తే జయసుధను నడిస్తోందని ఆరోపించారు. బుధవారం సాయంత్రం రాజేంద్ర ప్రసాద్ తన ప్యానల్తో కలసి మీడియాతో మాట్లాడారు. తెలుగు సినీ ప్రియులు అభిమానించే మీ రాజేంద్ర ప్రసాద్గా కొన్ని విషయాలను నేరుగా చెప్పదలచుకున్నానని వివరించారు. తాను కూడా చాలామంది హీరోయిన్లను పరిచయం చేశానని చెప్పారు. పరోక్షంగా కొందరు సినీ పెద్దలను విమర్శించారు.
మా అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేయాలని నిర్ణయం తీసుకునేటపుడు సినీ పరిశ్రమ పెద్దలను కలిశానని రాజేంద్ర ప్రసాద్ చెప్పారు. వారు తనకు మద్దతు ఇచ్చారని, కొంతమంది మాటమార్చారని విమర్శించారు. రియల్ ఎస్టేట్ వ్యాపారాలు చేసి ఎన్ని కోట్లు సంపాదించినా పోయేటపుడు వెంట ఏమీ తీసుకుపోరాని సినీ పెద్దలను ఉద్దేశించి విమర్శించారు. నటులు డబ్బులు తీసుకుని నటించవచ్చు కానీ తాను కళామతల్లికి సేవ చేశానని అన్నారు. ఎంతో మంది స్టార్లతో కలసి పనిచేశానని, సినీ పరిశ్రమలో తనతో పోటీగలవారు ఎవరూ లేరని అన్నారు.