అయితే ఏంటట?
చెన్నై: హలో...ప్రార్థన ... ప్రతి పైసా కౌంట్ ఇక్కడ? అంటూ అలరించిన వెంకటాద్రి ఎక్స్ప్రెస్ భామ రకుల్ ప్రీత్ సింగ్ లెక్కల్లో బాగా ఆరితేరినట్టే కనిపిస్తోంది. తన నటనతో పాటు అందంతో కుర్రకారులో క్రేజ్ పెంచుతున్న ఈ అమ్మడు దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలని ఆలోచిస్తోంది.
సక్సెస్ ఉన్నప్పుడే క్యాష్ చేసుకోవాలి.. ఏమాత్రం మొహమాటపడినా అంతే సంగతులు అంటోంది. డిమాండ్ ఉన్న నటీనటులు పెద్ద మొత్తంలో పారితోషికం తీసుకుంటే తప్పేంటి అని రకుల్ ప్రశ్నిస్తోంది. తాను ప్రొఫెషన్లో బాగా రాణిస్తున్నప్పుడు ఎక్కువ అడగడం తప్పులేదనీ, తనకా యోగ్యత ఉందని ధీమాగా చెబుతోంది.
బాగా పని చేసేటపుడు ,ఎక్కువ వేతనం తీసుకునే అర్హత అందరికీ ఉంటుందంటూ రకుల్ 'ఐఎఎన్' వార్త సంస్థతో వ్యాఖ్యానించింది. ఇంతకీ మీ 'పే' ఎంత అని మీడియా అడిగినప్పుడు మాత్రం సమాధానాన్ని దాటవేసిన ఈ అమ్మడు కెరీర్లో పీక్ స్టేజ్లో ఉన్నప్పుడు ఎక్కువ తీసుకుంటే తప్పేంటి .. ఇందులో తప్పేముందో నాకేమీ అర్థం కావడం లేదంటూ రుసరుసలాడిందట.
సినిమాకు కోటిన్నర రూపాయలు ఛార్జ్ చేస్తోందంటూ వచ్చిన వార్తలపై రకుల్ స్పందించింది. రవితేజతో చేసిన కిక్-2 సినిమాకు కోటిన్నర కంటే కాస్త తక్కువ తీసుకున్న ఈ భామ.. అక్టోబర్లో విడుదలకు సిద్ధమవుతున్న రామ్ చరణ్ బ్రూస్ లీ సినిమాకు అక్షరాలా కోటిన్నర తీసుకుందని సమాచారం.
దీంతో పాటు అల్లు అర్జున్ కొత్త సినిమా 'సరైనోడు' లో కూడా నటించేందుకు కోటిన్నర అందుకుందని తెలుస్తోంది. అటు ఎన్టీఆర్తో 'నాన్నకు ప్రేమతో' కూడా అంతే పారితోషికం అందుకుందట. మొత్తం మూడు సినిమాలతోనే రకుల్ ప్రీత్ సింగ్ దాదాపు నాలుగున్నర కోట్ల రూపాయల్ని పారితోషికంగా అందుకుందని ఫిలింనగర్లో వార్తలు షికారు చేస్తున్నాయి.
సంబంధిత వార్తలు