‘నన్నింకా అలాగే చూస్తున్నారు’

‘నన్నింకా గ్లామర్‌ డాల్‌గానే చూస్తున్నారు’ - Sakshi


చెన్నై: కోలీవుడ్‌లో తననింకా గ్లామర్‌ డాల్‌గానే చూస్తున్నారని హీరోయిన్‌ నికీషా పటేల్‌ వాపోతోంది‌. పవన్‌ కల్యాణ్‌ హీరోగా నటించిన కొమరం పులి చిత్రంతో టాలీవుడ్‌కు ఎంట్రీ ఇచ్చిన ఈ ఉత్తరాది భామ ఆ చిత్రం పెద్దగా ఆడక పోవడంతో చాలా నిరాశకు గురైందనే చెప్పాలి. అయితే ఆ తరువాత కోలీవుడ్‌లో అడుగుపెట్టి నారదన్, కడయోరం లాంటి కొన్ని చిత్రాలలో నటించినా ఆ చిత్రాలు ఆమెకు ఏమాత్రం కలిసి రాలేదనే చెప్పారు.


అప్పటి నుంచి గోల్డెన్‌ ఛాన్స్‌కోసం  నికీషా పటేల్‌ పోరాడుతూనే ఉంది. గత ఏడాది ఒకటి రెండు చిత్రాలలో నికిషా నటించినప్పటికీ ఆ చిత్రాలు ఏవీ విడుదల కాలేదు. తాజాగా 7 నాట్కళ్‌ అనే తమిళ చిత్రం త్వరలో విడుదలకు సిద్ధం అవుతోంది. ఆ సినిమాపైనే గంపెడు ఆశలు పెట్టుకున్న నికీషా తనకు మంచి పేరు తెచ్చిపెడుతుందనే ఆశాభావంతో ఉంది.



‘నిజమే, ఈ ఏడాది నేను నటించిన ఒక్క చిత్రం తెరపైకి రాలేదు. అలాగని ఖాళీగా కూర్చున్నానని అనుకోరాదు. తమిళం, తెలుగు చిత్రాలతో బిజీగానే ఉన్నాను. శక్తి పి.వాసుకు జంటగా నటించిన 7 నాట్కళ్‌ చిత్రం త్వరలో విడుదలకు సిద్దం అవుతోంది. ఇందులో శక్తి పి.వాసు చాలా డిఫరెంట్‌గా కనిసిస్తారు. క్రైం థ్రిల్లర్‌ కథాంశంతో రూపొందిన ఈ చిత్రంలో నాకు, శక్తి పీ.వాసులకు మధ్య మంచి రొమాంటిక్‌ సన్నివేశాలు ఉంటాయి. ఇకపోతే కోలీవుడ్‌లో నన్నింకా గ్లామరస్‌ నటిగానే చూస్తున్నారు.



అయితే తెలుగులో కొన్ని నటనకు అవకాశం ఉన్న చిత్రాల్లో నటించే అవకాశాలను అందుకుంటున్నాను. ఇక్కడ గ్లామర్‌ ఇమేజ్‌ను బ్రేక్‌ చేయాలని ఆశపడుతున్నాను. ప్రస్తుతం మాలీవుడ్‌ తరహాలో కోలీవుడ్‌లో కూడా చాలా రియలిస్టిక్‌ కథా చిత్రాలు వస్తున్నాయి. ఇక తెలుగులో షరా మామూలుగానే కమర్షియల్‌ కథా చిత్రాలే అధికంగా వస్తున్నాయి.’  అని పేర్కొంది. నికీషా పటేల్‌ ప్రస్తుతం మలయాళ చిత్రం 100 డిగ్రీ సెల్సియస్‌ తమిళ రీమేక్‌లోనూ, ఓ తెలుగు చిత్రంలో పాటు ఒక ద్విభాషా చిత్రంలోనూ నటిస్తున్నట్లు చెప్పింది.

Read latest News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top