హార్రర్ చిత్రంలో నయన

హార్రర్ చిత్రంలో నయన


ప్రస్తుతం కోలీవుడ్‌లో హీరోయిన్ ఓరియెంటెడ్ చిత్రాల నాయకిగా ఎదిగిన నటి ఎవరైనా ఉన్నారంటే అది ఒక్క నయనతారనే. రాజారాణి చిత్రంలో ఆర్య, జయ్ ఇద్దరు హీరోలు ఉన్నా ఆ చిత్ర కథ నయనతార పాత్ర చుట్టూనే తిరుగుతుంది. ఆ చిత్రం మంచి విజయాన్ని సాధించింది. ఇక ఇటీవల మాయ అనే హీరోయిన్ ఓరియెంటెడ్ చిత్రంలో నయనతార నటించగా ఆ చిత్రం అనూహ్య విజయాన్ని సొంతం చేసుకుంది. అంతే కాదు దాని తరువాత ఆమె నటించిన తనీఒరువన్, నానుమ్ రౌడీదాన్ చిత్రాలు వరుసగా విజయం సాధించడంతో హ్యాట్రిక్ సాధించిన నయనతార ఇప్పుడు లేడీ సూపర్‌స్టార్‌గా పిలవబడుతున్నారు.



తాజాగా మాయ చిత్రం తరహాలో మరో లేడీఓరియెంటెడ్ చిత్రంలో నటించడానికి సిద్ధమవుతున్నారు. యువ దర్శకుడు సర్గుణం సొంతంగా చిత్ర నిర్మాణం ప్రారంభించి తొలి ప్రయత్నంగా తన శిష్యుడు రాఘవన్ దర్శకత్వంలో మంజపై అనే చిత్రాన్ని నిర్మించారు. ఆ చిత్రం విజయాన్ని అందుకుంది. తాజాగా మరో శిష్యుడి దర్శకత్వంలో నటి నయనతార ప్రధాన పాత్రలో చిత్రం చేయనున్నారు. దీనిగురించి ఆయన ఒక ప్రకటన విడుదల చేస్తూ మంజపై వంటి సక్సెస్‌ఫు చిత్రం తరువాత ఏ సర్గుణం సినిమాస్ పతాకంపై నయనతార కథానాయకిగా చిత్రం నిర్మించనున్నానని తెలిపారు.



తాను దర్శకత్వం వహించిన తొలి చిత్రం కలవాణి నుంచి ఇటీవల తెరకెక్కించిన చండీవీరన్ వరకు తన వద్ద సహాయదర్శకుడిగా పని చేసిన దాస్ రామసామి ఈ చిత్రానికి  కథ, ద ర్శకత్వం బాధ్యతల్ని నిర్వహించనున్నట్లు వెల్లడించారు. ఇది హార్రర్ నేపథ్యంలో సాగే వినోదం మేళవించి క్రైమ్ థ్రిల్లర్ కథా చిత్రంగా ఉంటుందని తెలిపారు. ఇతర నటీనటులు, సాంకేతిక వర్గం ఎంపిక జరుగుతోందని చెప్పారు. ఇంకా పేరు నిర్ణయించని ఈ చిత్రం ఆబాలగోపాలాన్ని అలరించే జనరంజక చిత్రంగా ఉంటుందని దర్శకనిర్మాత సర్గుణం అన్నారు.

Read latest News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top