కేసీఆర్ దృష్టికి తీసుకెళ్తాం
థియేటర్ల లీజు విధానంపై నిరసన వ్యక్తం చేస్తూ... దాన్ని రద్దు చేయాలని కోరుతూ గత వారం రోజులుగా హైదరాబాద్లోనిచలనచిత్ర వాణిజ్య మండలి ఎదుట తెలంగాణ ప్రొడ్యూసర్ గిల్డ్ అధ్యక్షుడు ప్రతాని రామకృష్ణగౌడ్ ఆమరణ నిరాహార దీక్ష చేస్తున్న విషయం తెలిసిందే. శుక్రవారం ఆయన ఆరోగ్య పరిస్థితి మరింత క్షీణించడంతో మద్దతుదారులు ఫిలించాంబర్పై రాళ్లు రువ్వారు. దాంతో పోలీసులు రంగప్రవేశం చేసి పలువురిని అరెస్ట్ చేశారు. ఎట్టకేలకు మెదక్ ఎంపీ కొత్త ప్రభాకరరెడ్డి, భువనగిరి ఎంపీ బూర నరసయ్యగౌడ్, తెలంగాణ రాష్ట్ర రవాణాశాఖ మంత్రి పట్నం మహీందర్రెడ్డి శిబిరం వద్దకు చేరి ప్రతాని రామకృష్ణగౌడ్కి నిమ్మరసం ఇచ్చి దీక్షను విరమింపజేశారు.
తదనంతరం ప్రభాకరరెడ్డి మాట్లాడుతూ- ‘‘చిన్న సినిమాల సంక్షేమం కోసం ఆమరణ నిరాహారదీక్షకు దిగిన ప్రతాని రామకృష్ణగౌడ్కి కొందరు సంఘీభావం తెలుపకపోవడం బాధాకరం. లీజు విధానం వల్ల చిన్న నిర్మాతలు ఎదుర్కొంటున్న సమస్యలను మా రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్కి విన్నవిస్తాం. ప్రతిభ ఉన్నవారిని ప్రోత్సహించే విషయంలో తెలంగాణ ప్రభుత్వం ముందు ఉంటుంది’’ అన్నారు. రామకృష్ణ గౌడ్ మాట్లాడుతూ -‘‘లీజు విధాన్ని ప్రవేశపెట్టింది నిర్మాత డి.సురేశ్బాబు. ఆయనతో పాటు మరో ముగ్గురు, వారి అనుచరులు... ఇలా చాలామంది బినామీల కింద రెండు రాష్ట్రాల్లో థియేటర్లున్నాయి. థియేటర్ యాజమాన్యాన్ని బెదిరించి సినిమాలను ఆడిస్తున్నారు. అలాగే... ఫిలించాంబర్ ఎన్నికలు సక్రమంగా జరగడం లేదు. ప్రభుత్వం తరఫున ఓ ప్రతినిథిని నియమించి ఎన్నికలు సక్రమంగా జరిపించాలని ప్రభుత్వాన్ని కోరబోతున్నాం’’ అని చెప్పారు.