శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో సినిమా!
మహేశ్బాబు వేగం పెంచారు. ఇకపై ఎలాంటి విరామం లేకుండా సినిమాలు చేయడానికి ఆయన ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నారు. ప్రస్తుతం ఆయన కొరటాల శివ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నారు. ఇటీవలే చిత్రీకరణ మొదలైంది. ఆ తర్వాత పూరి జగన్నాథ్ దర్శకత్వంలో చేయడానికి మహేశ్ పచ్చజెండా ఊపారు. పోకిరి, బిజినెస్మేన్ తర్వాత మహేశ్-పూరి కాంబినేషన్లో రూపొందనున్న ఆ చిత్రాన్ని ఓ అగ్రనిర్మాత నిర్మించనున్నారు.
ఈ రెండు సినిమాల తర్వాత మహేశ్కు మరో ప్రాజెక్ట్ కూడా సిద్ధంగా ఉన్నట్టు సమాచారం. శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో చేయడానికి మహేశ్ అంగీకారం తెలిపారట. ‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’ టైమ్లో శ్రీకాంత్ పనితీరు నచ్చి, ఆయనతో మళ్లీ సినిమా చేస్తానని మహేశ్ మాటిచ్చారు. ఇటీవలే మహేశ్ను కలిసి శ్రీకాంత్ ఓ కథ చెప్పారట. 14 రీల్స్ ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై ఈ సినిమా 2015 ద్వితీయార్ధంలో తెరకెక్కనున్నట్లు సమాచారం. పూర్తి వివరాలు త్వరలోనే తెలుస్తాయి.