ప్రముఖ హీరో కోసం వేచి ఉండలేకే...

ప్రముఖ హీరో కోసం వేచి ఉండలేకే...


ప్రముఖ హీరో కోసం వేచి ఉండే సహనం తనకులేదంటున్నారు మహిళా దర్శకురాలు, నటి లక్ష్మీ రామకృష్ణన్. నటిగా బిజీగా ఉంటూనే మరో పక్క తన ఆలోచనలను తెరపై ఆవిష్కరించడానికి మెగాఫోన్ పట్టారు. తొలి ప్రయత్నంగా ఆరోహణం చిత్రాన్ని రూపొందించారు. ఆ చిత్రానికి సినీ విమర్శకుల నుంచి ప్రశంసలు, అభిమానుల ఆదరణ లభించింది. ప్రస్తుతం నెరింగివా ముత్తమిడాదే అనే పేరుతో చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. మెడిమిక్స్ సమర్పణలో ఏవీఎం ప్రొడక్షన్స్ పతాకంపై అనూప్ నిర్మిస్తున్న ఈ చిత్రంలో నవ నటుడు షబిర్ హీరోగా పరిచయం అవుతుండగా హీరోయిన్‌గా పియా బాజ్‌పాయ్ నటిస్తున్నారు.

 

 ఇతర ముఖ్య పాత్రల్లో శ్రుతి హరిహరణ్, తంబి రామయ్య, విజి చంద్రశేఖర్ తదితరులు నటిస్తున్నారు. ఎ.వినోద్ భారతి ఛాయాగ్రహణం అందిస్తున్న ఈ చిత్రానికి మెట్లి బ్రూస్ సంగీతాన్ని అందిస్తున్నారు. చిత్ర షూటింగ్ పూర్తి అయిన ఈ నెరింగివా ముత్తమిడాదే చిత్ర వివరాలను దర్శకురాలు లక్ష్మీ రామకృష్ణన్ తెలుపుతూ దర్శకురాలిగా తన తొలి చిత్రం ఆరోహణం చిత్రానికి మంచి ప్రశంసలు లభించాయన్నారు. ఆ ఉత్సాహం, ధైర్యంతోనే మలి యత్నంగా నెరింగివా ముత్త మిడాదే చిత్రాన్ని తెరకెక్కిస్తున్నట్లు పేర్కొన్నారు. చిత్రంలో హీరో షబిర్‌తో పాటు ఒక లారీ కూడా ముఖ్య పాత్రగా ఉంటుందన్నారు. పియా బాజ్‌పాయ్, తంబి రామయ్య, విజి చంద్రశేఖర్ పాత్రలకు చాలా ప్రాముఖ్యత ఉంటుందన్నారు.

 

 ఆ పాత్రలకు వాళ్లు జీవం పోశారనే చెప్పాలన్నారు. మరో విషయం ఏమిటంటే ఈ చిత్ర కథను తాను ఒక ప్రముఖ హీరోను దృష్టిలో పట్టుకుని తయారు చేసుకున్నానని చెప్పారు. అయితే ఆయన కాల్‌షీట్స్ కోసం వేచి ఉండే సహనం లేక నవ హీరోతో రూపొందించానని తెలిపారు. నెరింగివా ముత్త మిడాదే నాలుగు కథలతో కూడిన క్రైమ్ థ్రిల్లర్ చిత్రం అని చెప్పారు. అంతే కాకుండా జాతీయ స్థాయిలో సంచలనాత్మకమయిన ఒక అంశం ఇతి వృత్తంగా ఈ చిత్రాన్ని తెరకెక్కించినట్లు చెప్పారు. చిత్రాన్ని వచ్చే నెల తెరపైకి తీసుకురావడానికి సన్నాహాలు చేస్తున్నట్లు లక్ష్మీ రామకృష్ణన్ వెల్లడించారు.

 

Read latest News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top