కొరటాల శివ దర్శకత్వంలో...

కొరటాల శివ దర్శకత్వంలో...

చకచకా కథల్ని ఖరారు చేసుకుంటూ దూసుకుపోతున్నారు మహేశ్. ఓ వైపు ‘ఆగడు’ షూటింగ్‌తో బిజీగా ఉన్న మహేశ్ మరోవైపు కొరటాల శివ సినిమాకు పచ్చజెండా ఊపేశారు. ‘ఆగడు’ తర్వాత మహేశ్ చేసే సినిమా ఇదే. అంచనాలను మించే స్థాయిలో విశ్వజనీనమైన కథాంశంతో ఈ చిత్రం ఉంటుందని, కొరటాల శివ నమ్మకంగా చెబుతున్నారు. ‘మిర్చి’ అనే టైటిల్ పెట్టడమే కాదు... టైటిల్‌లోని ఘాటంతా... ప్రభాస్ పాత్ర చిత్రణలో చూపించి యువతరంతో శభాష్ అనిపించుకున్న కొరటాల... మహేశ్‌ని ఏ స్థాయిలో చూపిస్తారో! అనే విషయంపై అభిమానులు కూడా ఆసక్తిగా ఉన్నారు. యూ టీవీ మోషన్ పిక్చర్స్ ఈ చిత్రాన్ని నిర్మించనున్నారని గతంలో వార్తలొచ్చాయి.

 

  అయితే... తాజా సమాచారం ఏంటంటే... ఓవర్సీస్‌లో ఎన్నో విజయవంతమైన సినిమాలను విడుదల చేసిన మైత్రీ మూవీమేకర్స్ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మించనుంది. ఈ విషయాన్ని సోమవారం ఓ ప్రకటన ద్వారా తెలిపారు. తన రెండో సినిమాను మహేశ్‌తో చేయడం, అభిరుచి గల మైత్రీ మూవీమేకర్స్ ఈ చిత్రాన్ని నిర్మించనుండటం చాలా ఆనందంగా ఉందని కొరటాల శివ పేర్కొన్నారు. జూలైలో రెగ్యులర్ షూటింగ్ ప్రారంభిస్తామని, తమ తొలి సినిమా హీరో మహేశ్ కావడం అదృష్టంగా భావిస్తున్నామని నిర్మాతలు ఎర్నేని నవీన్, యలమంచిలి శంకర్ (తమ్ముడు), సీవీఎం (మోహన్) చెప్పారు. ఈ చిత్రానికి సంగీతం: దేవిశ్రీ ప్రసాద్, కెమెరా: మది, కూర్పు: కోటగిరి వెంకటేశ్వరరావు, కళ: ఏఎస్ ప్రకాశ్, ఎగ్జిక్యూటివ్ నిర్మాత: అశోక్.

 
Read latest News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top