ఆ రోజు త్వరలోనే వస్తుంది!

ఆ రోజు త్వరలోనే వస్తుంది! - Sakshi


ఆ రోజు త్వరలోనే వస్తుంది అని నమ్మకంగా చెబుతోంది నటి కీర్తీసురేశ్‌. తంతే గారెల బుట్టలో పడ్డ చందాన మాలీవుడ్‌ నుంచి కోలీవుడ్‌ వచ్చి పడ్డ నటి కీర్తీసురేశ్‌. పరిచయమైన కొద్ది రోజుల్లోనే ఇళయదళపతి విజయ్, ధనుష్‌ వంటి స్టార్‌ హీరోలతో నటించేసి తన మార్కెట్‌ను అమాంతం పెంచేసుకుంది. అంతేకాదు టాలీవుడ్‌లోనూ నటించిన రెండు చిత్రాలు విజయాన్ని చవిచూడడంతో అక్కడ యమ క్రేజ్‌ సంపాదించుకుంది. తాజాగా సూర్యతో తానాసేర్న్‌దకూటం చిత్రంలో రొమాన్స్‌ చేస్తున్న కీర్తీసురేశ్‌ త్వరలో మహానటి సావిత్రి జీవిత చరిత్రతో ద్విభాషా చిత్రంగా తెరకెక్కనున్న నడిగై తిలగైయార్‌(తెలుగులో మహానది)లో సావిత్రి పాత్రలో నటించడానికి రెడీ అవుతోంది.



ఇందులో మరో క్రేజీ నటి సమంత కూడా నటించనున్నారు. ఈమె పాత్రికేయురాలిగా నటించనున్నట్లు కోలీవుడ్‌ వర్గాల సమాచారం. కీర్తీసురేశ్‌ తెలుగులో పవన్‌కల్యాణ్‌కు జంటగా నటించే అవకాశాన్ని దక్కించుకుంది. ఇటీవల ఒక కార్యక్రమంలో పాల్గొన్న కీర్తీ నటిగా ఇంత త్వరగా ఈ స్థాయికి చేరుకుంటానని ఊహించలేదని పేర్కొంది.



 భైరవా చిత్రంలో విజయ్‌తో జత కట్టానంది. ఆయనతో నటించిన అనుభవం గురించి తాను ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదంది. అదే విధంగా ప్రస్తుతం మరో స్టార్‌ హీరో సూర్యతో కలిసి తానా సేర్న్‌దకూటం చిత్రంలో నటిస్తున్నానని చెప్పింది. ఇక మరో స్టార్‌ నటుడు అజిత్‌తో ఎప్పుడు రొమాన్స్‌ చేస్తారని అభిమానులు అడుగుతున్నారని, ఆ అవకాశం త్వరలోనే వస్తుందని నటి కీర్తీసురేశ్‌ చెప్పింది.



అంటే అజిత్‌ తదుపరి చిత్రంలో నాయకి ఈ అమ్మడేనా? అలాంటి చర్చలు జరుగుతున్నాయా? అన్న ప్రశ్నలకు సమాధానం త్వరలో వచ్చే అవకాశం ఉంది. ఇకపోతే తదుపరి విశాల్‌తో సండైకోళి 2 చిత్రంలో నటించనున్నట్లు కీర్తీ పేర్కొంది. మొత్తం మీద కోలీవుడ్, టాలీవుడ్‌లో ఈ ముద్దుగుమ్మ స్టార్‌ హీరోలతో నటిస్తూ పుల్‌ జోష్‌లో ఉందన్నమాట.

Read latest News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top