మళ్లీ తెరపైకి ఆమిర్ - కత్రినా జంట

మళ్లీ తెరపైకి ఆమిర్ - కత్రినా జంట


ఆమిర్ ఖాన్, అమితాబ్ బచ్చన్ లాంటి దిగ్గజాలు నటిస్తున్న ''థగ్స్ ఆఫ్ హిందోస్తాన్'' సినిమాలో కత్రినా కైఫ్ కూడా చేస్తున్న విషయం ఖాయమైంది. ఈ విషయాన్ని మిస్టర్ పెర్ఫక్షనిస్ట్ ఆమిర్ ఖాన్ స్వయంగా ట్వీట్ చేశారు. ''ఎట్టకేలకు మా చివరి థగ్గు కూడా వచ్చేసింది.. కత్రినా! వెల్కమ్ ఎబోర్డ్‌ కత్రినా'' అని ఆయన తన ట్విట్టర్ ద్వారా ప్రకటించారు. ప్రస్తుతం కత్రినా కైఫ్ అబుదాబిలో షూటింగ్‌లో ఉంది. గతంలో 2012లో వచ్చిన 'ఏక్ థా టైగర్' సినిమాకు సీక్వెల్‌గా అలీ అబ్బాస్ జాఫర్ తీస్తున్న 'టైగర్ జిందా హై' సినిమా షూటింగ్ కోసం అక్కడకు వెళ్లింది.



ఇక 'థగ్స్ ఆఫ్ హిందోస్తాన్' సినిమాతో మరోసారి కత్రినా, ఆమిర్, దర్శకుడు విజయ్ కృష్ణ ఆచార్య మరోసారి కలిసి చేస్తున్నట్లు అవుతుంది. ఇంతకుముందు వీళ్ల ముగ్గురి కాంబినేషన్‌లోనే 'ధూమ్ 3' సినిమా వచ్చింది. అయితే.. అమితాబ్, ఆమిర్ కలిసి స్క్రీన్ మీద కనిపించడం మాత్రం ఇదే మొదటిసారి అవుతుంది. కత్రినా మాత్రం ఇంతకుముందు అమితాబ్‌తో కలిసి సర్కార్, బూమ్ సినిమాల్లో చేసింది. ఇక థగ్స్ సినిమాలో ఇంతకుముందు దంగల్‌లో నటించిన ఫాతిమా సనా షేక్ కూడా కనిపిస్తుందట. వచ్చే నెలలో షూటింగ్ మొదలవుతుండగా, 2018 దీపావళికి సినిమా విడుదల అవుతుందంటున్నారు.


 

 

 

Read latest News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top